ఆ రోజు కోహ్లీ లేకుంటే టీమిండియా ఇజ్జత్ పోయేది….టీ20ల నుంచి అతన్నే తప్పిస్తారా?

టీ20 ఫార్మాట్‌‌కు సీనియర్ ఆటగాళ్లు అయిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్‌ను దూరంగా ఉంచుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని మాజీ సెలెక్టర్ సబా కరీం తప్పుబట్టాడు. రోహిత్, రాహుల్ విషయం ఏమో కానీ.. కోహ్లీని తప్పించడం సరికాదన్నాడు. టీ20ల్లో కోహ్లీ తన పాత్ర సమర్థవంతంగా నిర్వర్తించాడని తెలిపాడు. టీ20 ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ లేకుంటే టీమిండియా ఓటమిపాలయ్యేదని గుర్తు చేశాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్‌లను శ్రీలంకతో టీ20 సిరీస్‌కు ఎంపికచేయలేదు. ఈ క్రమంలో ఇండియా టీవీతో మాట్లాడిన సబా కరీం.. ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

‘విరాట్ కోహ్లీని టీ20ల నుంచి తప్పించడం షాకింగ్‌గా అనిపించింది. టీ20ల్లో విరాట్‌కు ఇచ్చిన రోల్‌ను అతను సమర్థవంతంగా నిర్వర్తించాడు. ఆసియా కప్ 2022, టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీల్లో లీడింగ్ రన్ స్కోరర్‌గా ఉన్నాడు. టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ లేకపోతే టీమిండియా ఓడిపోయేదే. అతను ఆడిన ఇన్నింగ్స్‌ చాలా విలువైనది. అలాంటి ఇన్నింగ్స్‌ ఆడిన తర్వాత కూడా విరాట్ కోహ్లీని టీ20ల నుంచి తప్పిస్తారా?.

నాకు తెలిసి శ్రీలంకతో టీ20 సిరీస్‌కు ఎంపిక కానంత మాత్రాన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇక పొట్టి ఫార్మాట్ ఆడరని కాదు. కుర్రాళ్లకు అవకాశం ఇస్తున్నారు. యంగ్ ప్లేయర్లు సరిగ్గా రాణించకపోతే మళ్లీ సీనియర్లు టీమ్‌లోకి రావాల్సిందే. విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్ లాంటి మ్యాచ్ విన్నర్లను అన్ని ఫార్మాట్లలో వాడుకోవాలి. ఫామ్‌లో లేని ప్లేయర్లను పక్కనబెట్టడంలో తప్పు లేదు. అయితే మ్యాచ్ విన్నింగ్ పర్ఫామెన్స్‌లు ఇచ్చిన తర్వాత కూడా టీమ్‌లో నుంచి తప్పించడం సరి కాదు.’అని సబా కరీం చెప్పుకొచ్చాడు.

ఈ ఏడాది టీ20ల్లో 138.23 స్ట్రైయిక్ రేటుతో 55.78 సగటుతో 781 పరుగులు చేశాడు విరాట్ కోహ్లీ. 2022లో అత్యధిక టీ20 పరుగులు చేసిన బ్యాటర్లలో మూడో స్థానంలో నిలిచాడు. సూర్యకుమార్ యాదవ్ 46.56 సగటుతో 1164 పరుగులు చేయగా మహ్మద్ రిజ్వాన్ 45.27 సగటుతో 996 పరుగులు చేశాడు. టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో నాలుగు హాఫ్ సెంచరీలు బాదిన విరాట్ కోహ్లీ, 296 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా టాప్‌లో నిలిచాడు.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh