ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల (Online Betting Apps) ప్రమోషన్పై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే పలువురిపై కేసులు నమోదు చేసి, అరెస్టులు కొనసాగిస్తున్నారు. లోకల్ బాయ్ నాని అరెస్టయిన ఘటన తర్వాత, తాజాగా భయ్యా సన్నీ యాదవ్పై కూడా కేసు నమోదు చేశారు.
తాజాగా, బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసిన ప్రముఖ యూట్యూబర్లు, సెలబ్రిటీలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇందులో భాగంగా మరో 11 మంది ప్రముఖులపై కేసులు నమోదు అయ్యాయి.
ఈ జాబితాలో బిగ్ బాస్ కంటెస్టెంట్ విష్ణుప్రియ, టేస్టీ తేజ, టాలీవుడ్ నటి సురేఖా వాణి కూతురు సుప్రిత, జబర్దస్త్ ఫేమ్ రీతూ చౌదరి, ప్రముఖ యూట్యూబర్ హర్షసాయి, పరేషాన్ బాయ్స్ ఫేమ్ ఇమ్రాన్ సహా మరికొందరు ఉన్నారు.
పంజాగుట్ట పోలీసులు తాజాగా వీరిపై కేసు నమోదు చేసి, విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు. ఈ రోజు సాయంత్రం విచారణకు హాజరుకావాలని స్పష్టం చేశారు. కాగా, మరికొంత మంది పరారీలో ఉన్నారని సమాచారం.
పరారీలో ఉన్నవారు తమ మొబైల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసినట్లు సమాచారం. స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేసి పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, మరింత లోతుగా విచారణ చేపట్టనున్నారు. ఈ కేసు ఇంకా ఏ విధంగా మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి!