అన్నదాతలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రైతులు వారి ఖాతా ద్వారా ఒకే సారి 4 వేల రూపాయలు పొందే అవకాశం కల్పించింది. మరి రైతులందరి ఖాతాల్లో ఈ మొత్తం జమ చేస్తుందా ఎవరు దీనికి అర్హులు వంటి వివరాలు కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన స్కీమ్ను అందుబాటులోకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఈ పథకంలో చేరిన అన్నదాతలకు కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది 6 వేల రూపాయలు అందజేస్తోంది. అయితే ఈ డబ్బులు ఒకేసారి కాకుండా విడతల వారీగా లభిస్తాయి. ఏడాదికి మూడు విడతల రూపంలో రైతుల బ్యాంక్ అకౌంట్లోకి పీఎం కిసాన్ స్కీమ్ కింద రూ. 2 వేలు చొప్పున మొత్తంగా రూ. 6 వేలు జమచేస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఇక ఇప్పటికే 13 విడతల డబ్బులను రైతులకు అందించింది. త్వరలోనే 14వ విడత డబ్బులు రావాల్సి ఉంది.
14వ విడత నిధుల్లో కొందరు రైతులు ఒకేసారి రూ.4 వేలు పొందే అవకాశం ఉంది. 13వ విడతలో రూ.2వేలు పొందలేనివారు ఈసారి మొత్తం కలిపి రూ.4వేలు జమచేయాలని కేంద్రం భావిస్తోంది. దీనివల్ల దేశవ్యాప్తంగా ఎంతోమంది రైతులకు లబ్ధి చేకూరనుంది.
13 విడత నిధులు విడుదల చేయడానికి ముందు తమ వివరాలను వెరిఫికేషన్ చేసుకోనివారికి రూ.2వేలు నిలిచిపోయాయి. గడువు ముగిసిన తర్వాత వారు తమ వివరాలను వెరిఫికేషన్ చేయించుకున్నప్పటికీ రూ.2వేలు జమ అవలేదు. వివరాల వెరిఫికేషన్ లో ఏదైనా సమస్య ఉంటే వెంటనే స్థానిక వ్యవసాయ శాఖ అధికారులను కలిసి వివరాలు తెలుసుకోవాలి. పీఎం కిసాన్ లబ్ధిదారుల లిస్ట్లో తమ పేరు ఉందో? లేదో రైతులు వెంటనే తెలుసుకోవడం ముఖ్యం.
పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్లో బెనిఫిషియరీ లిస్ట్ ఉంటుంది. దానిపై క్లిక్ చేసి రాష్ట్రం, జిల్లా, సబ్ డిస్ట్రిక్ట్, బ్లాక్, విలేజ్ ఆప్షన్లు ఎంచుకోవాలి. సబ్ మిట్ చేయగానే లబ్ధిదారుల జాబితా కనిపిస్తుంది. ఇందులో మీ పేరు ఉందో లేదో చూసుకోవచ్చు. ఈసారి మే 15 నాటికి ప్రభుత్వం రైతుల ఖాతాలకు పీఎం కిసాన్ డబ్బులను జమ చేసే అవకాశం ఉందని నివేదికలు పేర్కొంటున్నాయి. మరి మీకు 13వ విడత డబ్బులు రాకపోయి ఉండి.. వెరిఫికేషన్ ప్రాసెస్ పూర్తి చేసుకుని ఉంటే.. ఈ సారి మీ ఖాతాలో 4 వేల రూపాయలు పడే అవకాశం ఉంది.