భారత క్రికెట్ అభిమానులకు మరోసారి పెద్ద షాక్ తగిలింది. స్టార్ బ్యాట్స్మన్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ టెస్టు క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. కొద్ది రోజుల క్రితమే కెప్టెన్ రోహిత్ శర్మ టెస్టులకు గుడ్బై చెప్పిన సంగతి తెలిసిందే. వెంటనే కోహ్లీ కూడా అదే దారిలో నడవడం క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
విరాట్ కోహ్లీ ఈ నిర్ణయాన్ని తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా ప్రకటించాడు. 14 ఏళ్ల పాటు టెస్టుల్లో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించాను… ఇదే నాకు గర్వకారణమని పేర్కొన్నాడు. తన టెస్ట్ కెరీర్ను ఎప్పుడూ చిరునవ్వుతో గుర్తు చేసుకుంటానంటూ భావోద్వేగంతో పోస్ట్ చేశారు. 2008లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన కోహ్లీ, 2011లో టెస్ట్ డెబ్యూ చేసి దశాబ్దంపాటు భారత టెస్ట్ బ్యాటింగ్కు వెన్నుముకగా నిలిచాడు.
టెస్ట్లలో కోహ్లీ గణాంకాలు ఇవే:
మొత్తం టెస్టులు: 123
పరుగులు: 9,230
గౌరవమైన సగటు: 46.85
శతకాలు: 30
స్వదేశంలో (55 టెస్టులు): 4,336 పరుగులు @ 55.58
విదేశాల్లో (66 టెస్టులు): 4,774 పరుగులు @ 41.51
2014 నుంచి 2022 వరకు కెప్టెన్గా భారత జట్టును ముందుండి నడిపించిన విరాట్, 68 టెస్టుల్లో 40 విజయాలు అందించాడు. ఇది 58 శాతం విజయ రేటుకు సరిపోతుంది. 2018–19లో ఆస్ట్రేలియాలో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని గెలిపించి చరిత్ర సృష్టించిన నాయకుడు కోహ్లీనే.
టెస్ట్ మ్యాచ్ వివరాలు:
విరాట్ చివరి టెస్టు మ్యాచ్ 2024 నవంబర్లో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ భాగంగా ఆస్ట్రేలియాతో ఆడాడు. గత ఏడాది (2024) అతను 10 టెస్టుల్లో కేవలం 382 పరుగులకే పరిమితమయ్యాడు. 22.47 సగటుతో దారుణమైన ఫామ్కి గురైన కోహ్లీ, టెస్ట్ ఫార్మాట్కు వీడ్కోలు పలకడం వెనుక ఇదే ప్రధాన కారణంగా భావిస్తున్నారు క్రికెట్ విశ్లేషకులు.
ఇక ఇప్పటికే కోహ్లీ, రోహిత్లు కలిసి 2023 వరల్డ్ కప్ గెలిచాక టి20ల నుంచి తప్పుకున్నారు. ఇప్పుడు టెస్టులకూ రిటైర్మెంట్ ప్రకటించడంతో భారత జట్టు ఫ్యూచర్ కోసం కొత్త నాయకత్వం పై దృష్టిపెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.