ఐపీఎల్ 2025 చివరి లీగ్ మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ మరోసారి తన ధాటిని చూపించింది. ఈ సీజన్లో తొలి మ్యాచ్లో ఎలా ఆడిందో, అదే జోరుతో చివరి మ్యాచ్ లో కోల్కతా నైట్ రైడర్స్పై విరుచుకుపడింది. SRH బ్యాటర్లు చెలరేగి 20 ఓవర్లలో మూడు వికెట్లకు 278 పరుగులు చేసి భారీ లక్ష్యాన్ని నిర్దేశించారు. కేకేఆర్ 168 పరుగులకే ఆలౌట్ అయింది. 110 పరుగుల తేడాతో ఘన విజయం SRH ఖాతాలో పడింది.
ఐపీఎల్ చరిత్రలో ఐదోసారి 250కి పైగా స్కోరు చేసిన ఘనతను SRH సొంతం చేసుకుంది. అంతర్జాతీయ స్థాయి బౌలర్లను కూడా SRH బ్యాటర్లు ఊపిరి పీల్చనివ్వకుండా దెబ్బతీశారు. నోర్ట్జె, నరైన్, రస్సెల్, చక్రవర్తిలంతా భారీ పరుగులు ఇచ్చారు. ప్రతి ఒక్కరి ఎకానమీ రేట్ 10కి పైగా ఉండటం SRH బ్యాటింగ్ పవర్నే చూపిస్తోంది.
ఈ మ్యాచ్లో హెన్రిచ్ క్లాసెన్ అసలు వన్మ్యాన్ ఆర్మీలా ఆడాడు. 37 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి నాటౌట్గా నిలిచాడు. తొమ్మిది సిక్సర్లు, ఆరు ఫోర్లతో చెలరేగిపోయాడు. ఇది ఐపీఎల్ చరిత్రలో మూడో వేగవంతమైన సెంచరీగా నమోదైంది. కోల్కతా బౌలర్లెవ్వరినీ విడిచిపెట్టకుండా ఎటు తిప్పితే అటు సిక్సర్ల వర్షం కురిపించాడు.
అభిషేక్ శర్మ 16 బంతుల్లో 32, ట్రావిస్ హెడ్ 40 బంతుల్లో 76 పరుగులు చేసి మంచి ఓపెనింగ్ అందించారు. ఇషాన్ కిషన్ 29, అనికేత్ వర్మ 12 పరుగులతో చివర్లో మంచి ఫినిషింగ్ ఇచ్చారు.
కేకేఆర్ ఇన్నింగ్స్లో మొదటి నుండి చివరి వరకూ ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది. మిడిల్ ఆర్డర్లో మనీష్ పాండే ఒక్కరే కొంత స్కోర్ చేశాడు (37 పరుగులు). హర్షిత్ రాణా 34, నరైన్ 31 పరుగులు చేసి పర్వాలేదనిపించారు. SRH బౌలర్లలో జైదేవ్ ఉనద్కత్, ఎషాన్ మలింగ, హర్ష్ దుబే మూడు వికెట్లు తీశారు.
సీజన్ తొలి మ్యాచ్లో రాజస్థాన్పై 286 పరుగులు చేసిన SRH, ఆ తర్వాత కొంత వెనకబడినప్పటికీ, చివరి మూడు మ్యాచ్ల్లో దుమ్ము దులిపింది. చివరి మూడింటిలో ఘన విజయాలతో, తొమ్మిదో స్థానంలో ఉన్న జట్టు ఆరవ స్థానానికి దూసుకొచ్చింది. మొత్తం 14 మ్యాచ్లలో 6 విజయాలు, 7 పరాజయాలు, ఒక రద్దు. రద్దయిన మ్యాచ్ ఆడినట్లైతే పరిస్థితి వేరేలా ఉండేదేమో!