కుటుంబ బాధ్యతలు నిర్వర్తించాల్సిన తండ్రి వ్యసనాలకు బానిసై భార్యాపిల్లలను వేధించడం అలవాటు చేసుకున్నాడు. చివరికి వాళ్ల చేతుల్లోనే బలైపోయాడు.
తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలో దారుణం చోటుచేసుకుంది. తల్లిని వేధిస్తున్న తండ్రిని తనయులు హత్యచేసిన ఘటన ఆదివారం తూర్పుగూడెం గ్రామంలో వెలుగులోకివచ్చింది. కుటుంబీకులు, పోలీసుల కథనం ప్రకారం.. తూర్పుగూడెం గ్రామానికి చెందిన తిప్పపర్తి భాస్కర్.. మద్యానికి బానిసయ్యాడు. రోజూ తాగడం, భార్య కరుణారాణిని కొట్టడం, కొడుకులపై దాడిచేయడమే అతని దినచర్య. అతనికి లేని చెడు అలవాట్లు అంటూ ఏవీ లేవు. పైపెచ్చు.. భార్యను వేధించడం మొదలు పెట్టాడు. అవన్నీ భరిస్తూ.. ఆమె రోజులు గడుపుతూ వస్తోంది. వాళ్ల ఇద్దరు కొడుకులు తరుణ్.. హైదరాబాద్లో ఉంటున్నారు. ఇక్కడ డ్రైవర్లుగా పనిచేస్తూ ఉపాధి పొందుతున్నారు.
అయితే, ఇంటి దగ్గర మాత్రం ఆ తల్లికి చిత్రహింసలు మాత్రం తప్పడం లేదు. భాస్కర్ కూడా భార్యపై పదునైన ఆయుధాలతో దాడి చేసేవాడు. కొడుకులు ఎన్నిసార్లు హెచ్చరించినా నాన్న తీరు ఏమాత్రం మారలేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. నిన్న ఇద్దరు కుమారులు తరుణ్, బాలతేజ పండుగ సందర్భంగా ఇంటికి వెళ్లారు. భాస్కర్ ప్రవర్తనలో మార్పు రాకపోయినప్పటికీ, అతను తన వైఖరిని కొనసాగించాడు. కొడుకుల ముందే తల్లిని కొట్టేవాడు. అసభ్య పదజాలంతో దూషించాడు.
శనివారం రాత్రి భాస్కర్ ఇంట్లో కుటుంబ సభ్యులతో గొడవ పడ్డాడు. ఆదివారం కూడా మరోసారి ఇంట్లో గొడవ జరిగి.. భాస్కర్.. భార్య, కుమారులపై దాడి చేశాడు. ఆత్మరక్షణ కోసం ఇంట్లో ఉన్న తండ్రిపై కొడుకులు కత్తులతో దాడి చేశారు. దీంతో తీవ్రగాయాలపై ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. ఆ తర్వాత ఇద్దరు కొడుకులు పారిపోయారు.
ఈ ఘటనతో తూర్పుగూడెం గ్రామం ఒక్కసారిగా ఉలిక్కపడింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామంటామని ఎస్సై అలీ చెప్పారు.