కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు ఏం జరుగుతుందో అస్సలు ఊహించలేం. ఆ పార్టీ అధినేతలు తీసుకునే నిర్ణయాల్లో అనూహ్య పరిణామాలుంటాయి. వాటిని పసిగట్టడం సీనియర్లకు కూడా అంత ఈజీ కాదు. క్షేత్రస్థాయిలో కొంతమంది నేతలు హడావుడి చేస్తుంటారు. అందుకు విరుద్ధంగా హైకమాండ్ నిర్ణయాలు ఉంటాయి. ఇప్పుడు తెలంగాణ ఎమ్మెల్సీ అవకాశందక్కిన విజయశాంతి విషయంలోనూ అదే జరిగింది.
తెలుగు సినీ పరిశ్రమలో లేడీ అమితాబ్ గా ఓ వెలుగు వెలిగిన విజయశాంతి, తెలంగాణ రాజకీయాలలో ఫైర్ బ్రాండ్ నాయకురాలిగా గుర్తింపు పొందారు. అటువంటి విజయశాంతికి పార్టీ అధిష్ఠానం ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో పార్టీ టికెట్ ఇవ్వటం. రాష్ట్ర కాంగ్రెస్ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసిందనడంలో సందేహం లేదు. సరిగ్గా గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీని వీడి కాంగ్రెస్ గూటికి చేరిన విజయశాంతి ఆ ఎన్నికలలో కానీ, ఆ తరువాత జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో కానీ రాష్ట్ర కాంగ్రెస్ తరఫున పెద్దగా ప్రచారం చేసిన దాఖలాలు లేవు. సరే ఆ సంగతి పక్కన పెడితే ఇప్పుడు ఆమెకు హై కమాండ్ ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడంలోనూ రాష్ట్ర కాంగ్రెస్ ప్రమేయం లేదు. అసలు రాష్ట్ర పార్టీ నాయకత్వం నుంచి ఆమె పేరును ఎవరూ సిఫారసు కూడా చేయలేదు. ఆమె గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీని వీడి కాంగ్రెస్ గూటికి చేరిన సందర్భంలో అప్పటి రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జ్ ఇచ్చిన హామీ మేరకు ఇప్పుడు విజయశాంతికి ఎమ్మెల్సీ టికెట్ దక్కిందన్న చర్చ కాంగ్రెస్ వర్గాలలో జోరుగా సాగుతోంది.
మొత్తం మీద రాష్ట్ర కాంగ్రెస్ నేతల అవసరం లేకుండా, ఇక్కడి నేతలతో సంబంధం లేకుండా విజయశాంతి పేరును నేరుగా అధిష్ఠానమే ఖరారు చేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల తరువాత జరగనున్న రేవంత్ కేబినెట్ విస్తరణలో విజయశాంతికి బెర్త్ కన్ఫర్మ్ అంటూ రాష్ట్ర కాంగ్రెస్ వర్గాలు గట్టిగా చెబుతున్నాయి. ఇందుకు కారణంగా వారు.. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులకు దీటుగా బదులిచ్చే నాయకులు రాష్ట్ర కాంగ్రెస్ లో చాలా తక్కువగా ఉన్నారనీ, మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ తప్ప కేటీఆర్, హరీష్ ల విమర్శలకు దీటుగా బదులిస్తున్న నేతల దాఖలాలు లేవనీ అంటున్నారు. ఈ పరిస్థితుల్లో త్వరలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా పొలిటికల్ గా యాక్టివ్ అవుతారన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో కేబినెట్ లో విజయశాంతి వంటి ఫైర్ బ్రాండ్ లీడర్ అవసరమని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తున్నదని చెబుతున్నారు.
మరోవైపు కొత్తగా తెలంగాణ కాంగ్రెస్ ఇన్ ఛార్జ్ బాధ్యతలు చేపట్టిన మీనాక్షి నటరాజన్ కు విజయశాంతితో మంచి సంబంధాలున్నాయి. మీనాక్షి నటరాజన్, విజయశాంతి ఇద్దరూ 2009 నుంచి 2014 వరకు ఎంపీలుగా పనిచేశారు. అప్పుడు పార్టీ వాయిస్ ను లోక్ సభలో బలంగా వినిపించేవారు. హైదరాబాద్ వచ్చినప్పుడు మీనాక్షి నటరాజన్ కూడా విజయశాంతి గురించి ఆరా తీశారు. ఆమె సేవలు వాడుకోవాలని పీసీసీకి సూచించారు. దీంతో విజయశాంతికి ఎమ్మెల్సీ అవకాశం ఖాయమనే ప్రచారం జరిగింది. అన్నట్లుగానే ఓబీసీ కోటాలో విజయశాంతిని ఎమ్మెల్సీగా ఎన్నుకున్నారు. ఇక మిగిలింది కేబినెట్ లోకి తీసుకోవడం. విజయశాంతి లాంటి వాళ్లు యాక్టివ్ పాలిటిక్స్ లో ఉంటే పార్టీ వాయిస్ ను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లగలరని కాంగ్రెస్ భావిస్తున్నట్టు సమాచారం. దీంతో ఆమెకు మంత్రి పదవి ఖాయమనే ప్రచారం సాగుతోంది.