ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ మరోమారు మాజీ సీఎం తన సోదరుడు జగన్మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకొని సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేతలకి, జగన్ కు దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు ఉచ్చరించే హక్కేలేదని ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ ఖరాఖండిగా అన్నారు.. పోలవరం ప్రాజెక్ట్ పై షర్మిళ ఓ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వంతో పాటు, వైసీపీ ప్రభుత్వంపై సంచలన కామెంట్స్ చేశారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గింపుపై కూటమి ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా చెప్తున్నవి పచ్చి అబద్ధాలని విమర్శించారు. మసి పూసి మారేడు కాయ చేసినట్లు నిజాలను దాచి పెడుతున్నారు అని అన్నారు.
రాష్ట్ర జీవనాడి అయిన ప్రాజెక్టులో జీవం తీసేశారన్నారు. ఎత్తు తగ్గించి 194 TMC ల నీటి నిల్వ సామర్థ్యం నుంచి 114 TMC లకు పరిమితం చేశారని విమర్శించారు. 22 లక్షల ఎకరాల పాత ఆయకట్టు స్థిరీకరణకు, 8 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు అందించే వైఎస్సార్ నిర్ధేశిత లక్ష్యాన్ని నీరుగార్చే కుట్రలు చేస్తున్నారన్నారు. 45.72 మీటర్ల ఎత్తులో ప్రాజెక్టు కట్టి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలని వైఎస్సార్ అనుకుంటే.. 41.15 మీటర్ల ఎత్తుకు కుదించి పోలవరంను మినీ రిజర్వాయర్గా మార్చుతున్నారన్నారు.
నీటి నిల్వకు తప్ప ఎందుకు పనికి రాని ప్రాజెక్టుగా చేస్తున్నారని షర్మిల విమర్శించారు. వైసీపీకి, జగన్ కు దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు ఉచ్చరించే హక్కేలేదని షర్మిళ తేల్చి చెప్పారు. ఇక పోలవరం ప్రాజెక్టుపై మాట్లాడే నైతికత వైసీపీ పార్టీకి లేదు. పోలవరం ప్రాజెక్టు పేరు వింటే వైఎస్సార్ గుర్తుకు వచ్చే మీకు 5 ఏళ్లు అధికారం ఇస్తే గాడిదలు కాశారా ? అని ప్రశ్నించారు. వైఎస్సార్ జీవిత ఆశయం పోలవరం అని మీకు తెలియదా ? అధికారంలో ఉండగా తట్టెడు మట్టి అయినా తీశారా ? అంటూ ప్రశ్నలు సంధించారు.
ప్రాజెక్టు ఎత్తు 45.72 మీటర్ల నుంచి 41.15 మీటర్లకు కుదించే ప్రతిపాదనకు ఒప్పుకున్నది మీరు కాదా ? నాడు ప్రధానికి రాసిన లేఖల్లోనూ 41.15 మీటర్ల మేరకు నిధులు విడుదల చేయాలని అడగలేదా ? వరదలకు డయాఫ్రమ్ వాల్ కొట్టుకు పోవడానికి మీ అనాలోచిత నిర్ణయాలే కారణం అని ..పోలవరం అథారిటీ ఇచ్చిన రిపోర్ట్ మీ నిర్లక్ష్యానికి నిదర్శనం కాదా ? అంటూ గాటుగా విమర్శించారు. రివర్స్ టెండరింగ్ పేరుతో పోలవరం ప్రాజెక్టును సర్వనాశనం చేశారు. కుడి, ఎడుమ కాలువల సామర్థ్యాన్ని తగ్గించి మహానేత ఆశయాలకు తూట్లు పొడిచారని షర్మిల ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు నిర్వీర్యం చేసే కుట్రలో చంద్రబాబు భాగస్వామి అయితే, కర్త, కర్మ, క్రియ జగన్ మోహన్ రెడ్డి గారేనని సంచలన షర్మిల ట్వీట్ ద్వారా కామెంట్స్ చేశారు