Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి కి తృటిలో తప్పిన ప్రమాదం!

హైదరాబాద్ నోవాటెల్ హోటల్‌లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. సీఎల్పీ సమావేశం ముగించుకొని లిఫ్ట్‌లోకి ఎక్కిన ఆయనకు అనుకోకుండా ఓ చేదు అనుభవం ఎదురైంది. ఎనిమిది మందికి మించకుండా ఉండే సామర్థ్యం కలిగిన లిఫ్ట్‌లో 13 మంది ఎక్కడంతో సాంకేతిక సమస్య తలెత్తింది. లిఫ్ట్ అర్ధమార్గంలో నిలిచిపోవడంతో అధికారులు, సెక్యూరిటీ సిబ్బంది టెన్షన్ కి గురయ్యారు.

సమయస్ఫూర్తితో స్పందించిన హోటల్ సిబ్బంది మరియు సీఎం భద్రతా సిబ్బంది వెంటనే లిఫ్ట్‌ను మాన్యువల్‌గా ఓపెన్ చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. తర్వాత సీఎంను వేరే లిఫ్ట్ ద్వారా సెకండ్ ఫ్లోర్‌కి సురక్షితంగా తీసుకెళ్లారు. ఈ సంఘటన అనంతరం కొంతసేపు హోటల్ ప్రాంగణంలో టెన్షన్ వాతావరణం నెలకొంది.

ఈ ఘటనపై సెక్యూరిటీ వ్యవస్థపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంత కీలకమైన వ్యక్తి ప్రయాణిస్తున్న సందర్భంలో లిఫ్ట్‌లో పరిమితిని మించి వ్యక్తులను ఎలా అనుమతించారు? అనేది ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది.

ఇక నోవాటెల్ హోటల్‌లో జరిగిన సీఎల్పీ సమావేశంలో సీఎం రేవంత్ మాట్లాడుతూ, “ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కీలకమైన సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది,” అన్నారు. రేషన్ కార్డుపై అందిస్తున్న సన్న బియ్యం పథకాన్ని ప్రత్యేకంగా ప్రశంసించారు. ఇదొక శాశ్వతమైన మార్పుకు నాంది అన్నారు.

ఇందిరమ్మ ఇండ్ల పథకం, భూ భారతి, ఎస్సీ ఉపకులాల వర్గీకరణ వంటి అంశాలపై రేవంత్ స్పష్టంగా తన ఆలోచనలు వెల్లడించారు. “42 శాతం రిజర్వేషన్ల బిల్లుతో మేము సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నామని నిరూపించాం,” అన్నారు. ప్రజల కోసం పని చేసే ప్రభుత్వం ఇదే అనే స్పష్టమైన సందేశాన్ని సీఎం రేవంత్ ఈ సమావేశం ద్వారా ప్రజలకు అందించారు.

ఈ సంఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగకపోవటం ఊపిరి పీల్చుకునే అంశంగా చెప్పవచ్చు.. ఇకపై సీఎం భద్రత విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం వుంది.

Leave a Reply