ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. తాజాగా ముగ్గురు వైసీపీ ఎమ్మెల్సీలు – మర్రి రాజశేఖర్ రెడ్డి, బల్లి కల్యాణ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ టీడీపీ లో చేరారు. సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో ఈ ముగ్గురు నేతలు తెలుగు దేశం పార్టీ కండువాలు కప్పుకున్నారు.
ఇప్పుడు వీరు వైసీపీ సభ్యత్వానికి, తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా లేఖలు ఇచ్చారు. అయితే ఏపీ శాసన మండలి చైర్మన్ ఈ రాజీనామాలను ఇంకా ఆమోదించలేదు.
2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓడిన తర్వాత పార్టీ నుండి ఒక్కొక్కరు రాజీనామాలు చేస్తున్నారు. ఇంతకు ముందు జయమంగళ వెంకటరమణ, పోతుల సునీత వంటి ఎమ్మెల్సీలు కూడా వైసీపీకి గుడ్ బై చెప్పారు. ఇప్పుడు మరోసారి ముగ్గురు ఎమ్మెల్సీలు రాజీనామా చేయడం రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పటికే వైసీపీకి అసెంబ్లీలో బలం తగ్గిపోయింది. కొత్త రాజీనామాలతో శాసన మండలిలో పార్టీ స్థానం మరింత తగ్గనుంది.
టిడిపిలో చేరిన ఎమ్మెల్సీలు రాజశేఖర్ గారు, కల్యాణ చక్రవర్తి గారు , పద్మశ్రీ గారు ..#YSRCPNeverAgain #AndhraPradesh pic.twitter.com/3915QUAbTQ
— iTDP Official (@iTDP_Official) September 19, 2025
కర్రి పద్మశ్రీ
పద్మశ్రీ 2022లో గవర్నర్ నామినేషన్ కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. మహిళా నాయకురాలిగా ఆమెకు గుర్తింపు ఉంది. టీడీపీలో చేరడం ఆ రాజకీయ ప్రాధాన్యాన్ని పెంచింది.
బల్లి కల్యాణ చక్రవర్తి
తిరుపతి జిల్లా నుంచి వచ్చిన కల్యాణ చక్రవర్తి 2021లో ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఆయన తండ్రి దుర్గారావు టీడీపీలోనే ఉన్నారు. తాజాగా వైసీపీకి రాజీనామా చేసి, టీడీపీలో చేరడం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామంగా ఉంది.
మర్రి రాజశేఖర్ రెడ్డి
పల్నాడు జిల్లా నుంచి మర్రి రాజశేఖర్ రెడ్డి 2021లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఈ ఏడాది మార్చిలో ఆయన వైసీపీకి, మండలి సభ్యత్వానికి రాజీనామా చేసినప్పటికీ ఆమోదం రాలేదు. దీంతో ఇప్పుడు ఆయన టీడీపీలో చేరారు.