Tatikonda Aishwarya: హైదరాబాద్ కు చేరుకున్న మృతదేహం..

Tatikonda Aishwarya

Tatikonda Aishwarya: హైదరాబాద్ కు చేరుకున్న మృతదేహం..

Tatikonda Aishwarya: ఈ నెల 6న అమెరికా టెక్సాస్ కాల్పుల్లో చనిపోయిన తాటికొండ ఐశ్వర్య(27) మృతదేహం నిన్న(బుధవారం) రాత్రి హైదరాబాద్‌కు చేరుకుంది. దుండగుడు జరిపిన కాల్పులలో ఐశ్వర్య తో పాటు మరో 8మంది మృతి చెందారు.అమెరికా కాలమానం ప్రకారం గత శనివారం మధ్యాహ్నం ఐశ్వర్య తన స్నేహితుడితో కలిసి టెక్సాస్‌లోని ఓ మాల్‌కు షాపింగ్‌కు వెళ్లింది. 3.36 గంటల సమయంలో అగంతుకుడి కాల్పుల్లో మృతి చెందింది. గాయపడిన ఏడుగురు వ్యక్తుల్లో ఐశ్వర్య స్నేహితుడు కూడా ఉన్నాడు.  బుధవారం సాయంత్రం ఆమె మృతదేహాన్ని తీసుకొచ్చిన విమానం రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరింది.

అయితే తొలుత మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావడానికి కుటుంబ సభ్యులు అమెరికా వెళ్లాలని నిర్ణయించుకున్నారు. కానీ హ్యూస్టన్ లోని భారత కాన్సులేట్ జనరల్ తో పాటు అన్ని ఏజెన్సీలను సమన్వయం చేయించి ఐశ్వర్య మృతదేహాన్ని హైదరాబాద్ కు తరలించే బాధ్యతను తానా తీసుకుంది. ‘‘అలెన్ మాల్ లో జరిగిన హింసాకాండ నన్ను తీవ్రంగా కలచివేసింది. తానా తరఫున బాధితులందరికీ, ముఖ్యంగా ఐశ్వర్య, ఆమె కుటుంబానికి మా మద్దతు, సంఘీభావం తెలియజేస్తున్నాం’’ అని తానా ప్రతినిధి అశోక్ బాబు తన ఫేస్ బుక్ పోస్ట్ లో పేర్కొన్నారు.

Also Watch

Hyderabad:  భాగ్య నగరవాసులకు అలర్ట్ …

కాగా.. ఐశ్వర్య స్వగ్రామం సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మునిసిపాలిటీ పరిధిలోని పాతనేరేడుచర్ల. రంగారెడ్డి జిల్లా కమర్షియల్‌ కోర్టు జడ్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్న తాటికొండ నర్సిరెడ్డి, అరుణ దంపతుల కుమార్తె ఆమె. ఆ దంపతులకు శ్రీకాంత్‌రెడ్డి అనే కుమారుడు కూడా ఉన్నాడు. నర్సిరెడ్డి కుటుంబం ప్రస్తుతం హైదరాబాద్‌ సరూర్‌నగర్‌లోని హుడాకాలనీలో నివాసం ఉంటోంది.

హైదరాబాద్‌లోని మాతృశ్రీ ఇంజనీరింగ్‌ కళాశాలలో ఇంజనీరింగ్‌ పూర్తి చేసిన ఐశ్వర్య.. ఉన్నత చదువుల కోసం 2018లో అమెరికా వెళ్లింది. ఈస్టర్న్‌ మిషిగన్‌ యూనివర్సిటీలోని గ్రాండ్‌ స్కూల్‌లో కన్‌స్ట్రక్షన్‌ మేనేజ్‌మెంట్‌లో ఎమ్మెస్‌ పూర్తి చేసి, టెక్సస్‌ సమీపంలోని పర్‌ఫెక్ట్‌ జనరల్‌ కాంట్రాక్టర్స్‌ కంపెనీలో ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌గా పనిచేస్తోంది. కిందటి సంవత్సరం డిసెంబరులో తన అన్న శ్రీకాంత్‌రెడ్డి పెళ్లికి చివరిసారిగా భారత్‌కు వచ్చిందామె.

Leave a Reply