TG Budget 2025: తెలంగాణ బడ్జెట్ 2025-26: కీలక రంగాలకు భారీ నిధులు కేటాయింపు..?

తెలంగాణ ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ఈ రోజు శాసనసభలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈసారి బడ్జెట్‌ మొత్తం రూ.3 లక్షల కోట్లకు పైగా ఉండనుందని సమాచారం. ముఖ్యంగా ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీల అమలుకు గణనీయమైన నిధులను కేటాయించే అవకాశం ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆదాయ అంచనాల కన్నా రూ.50 వేల కోట్ల వరకూ తగ్గుదల నమోదయ్యే అవకాశముంది. బడ్జెట్‌లో ప్రధానంగా సాగునీటి పారుదల, వ్యవసాయం, విద్య, రహదారులు, మౌలిక సదుపాయాలు, ఆరోగ్య రంగాలకు భారీ కేటాయింపులు చేయనున్నారు. కేంద్రం నుంచి నిధుల ఉపసంహరణ, పన్నేతర ఆదాయ వనరులలో తగ్గుదల వంటి అంశాలు రాష్ట్ర బడ్జెట్‌పై ప్రభావం చూపే అవకాశమున్నాయి.

ఈ బడ్జెట్‌లో వ్యవసాయం, విద్య, నీటిపారుదల, రహదారులకు ప్రాధాన్యత ఇస్తున్నారు. సాగునీటి పారుదల శాఖకు రూ.26 వేల కోట్లు, విద్యాశాఖకు రూ.30 వేల కోట్లు కేటాయించనున్నారు. యువత కోసం ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ‘యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్స్’ కు రూ.11 వేల కోట్లు కేటాయించనున్నారు. వ్యవసాయానికి ఉచిత కరెంట్ పథకానికి రూ.21 వేల కోట్లు, రహదారుల విస్తరణ, మౌలిక వసతుల అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేయనున్నారు. రాష్ట్రంలో గ్రామీణ ప్రాంత అభివృద్ధికి, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి వంటి పథకాలకు కూడా భారీ నిధులు కేటాయించే అవకాశం ఉంది. రాష్ట్రంలోని పేద, మధ్య తరగతి ప్రజలకు ఉపయోగపడే సంక్షేమ కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షన్లకు కూడా సరిపడా నిధులను కేటాయిస్తారని సమాచారం.

నూతన అభివృద్ధి ప్రాజెక్టులలో మూసీ రివర్ ఫ్రంట్, ఫ్యూచర్ సిటీ, మెట్రో విస్తరణ, ప్రాంతీయ వలయ రహదారి వంటి ప్రాజెక్టులకు పెద్ద మొత్తంలో నిధులు కేటాయించనున్నారు. రాజీవ్ యువ వికాసం పథకానికి రూ.6 వేల కోట్లు, నగరాభివృద్ధి పథకానికి రూ.4 వేల కోట్లు మంజూరు చేయనున్నారు. మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి రూ.4 వేల కోట్లు, పేదల ఇళ్లకు నెలకు 200 యూనిట్ల ఉచిత కరెంట్ పథకానికి రూ.2 వేల కోట్లు కేటాయించనున్నారు. ఈ పథకాలు ముఖ్యంగా పట్టణ ప్రాంత అభివృద్ధికి దోహదపడతాయని ప్రభుత్వం భావిస్తోంది. అదనంగా మౌలిక సదుపాయాల అభివృద్ధిలో భాగంగా ప్రధాన నగరాల్లో రోడ్లు, ఫ్లైఓవర్లు, డ్రైనేజ్ వ్యవస్థ మెరుగుపరిచేందుకు నిధులు కేటాయించే యోచనలో ఉంది. మౌలిక రంగ ప్రాజెక్టుల ప్రణాళికను బడ్జెట్‌లో విస్తృతంగా చర్చించనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

వైద్యారోగ్య రంగానికి కూడా భారీ నిధులు కేటాయించనున్నారు. గత ఏడాది వైద్యారోగ్యశాఖకు రూ.11,800 కోట్లు కేటాయించగా, ఈసారి కనీసం రూ.18 వేల కోట్లు మంజూరు చేసే అవకాశం ఉంది. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకానికి ప్రస్తుతం రూ.50 కోట్లు మంజూరు కాగా, దీనిని రూ.100 కోట్లకు పెంచే యోచనలో ప్రభుత్వం ఉంది. గిరిజన, దళిత ప్రజలకు వైద్య సేవలను మరింత మెరుగుపరిచేందుకు ప్రత్యేక వైద్యశాలలు ఏర్పాటు చేయనున్నారు. కొత్తగా మెడికల్ కాలేజీలను ఏర్పాటుచేయడానికి కూడా నిధులు కేటాయించే అవకాశముంది. ఈసారి బడ్జెట్ ద్వారా రాష్ట్రంలోని కీలక రంగాలకు భారీ నిధులు కేటాయిస్తూ, అభివృద్ధికి మరింత ఊతం ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రభుత్వ ప్రాధాన్యతలను, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రతిబింబించేలా ఈ బడ్జెట్‌ను రూపొందించినట్లు అధికారులు వెల్లడించారు.

Leave a Reply