హైదరాబాద్ నగరాన్ని కుదిపేసిన అప్సర హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న పూజారి సాయికృష్ణకు రంగారెడ్డి జిల్లా కోర్టు జీవితఖైదు శిక్ష విధించింది. అదనంగా, సాక్ష్యాలను తారుమారు చేసినందుకు మరో ఏడేళ్ల జైలు శిక్షతో పాటు అప్సర కుటుంబానికి రూ.10 లక్షల నష్టపరిహారం చెల్లించాల్సిందిగా తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుతో బాధిత కుటుంబం సంతృప్తి వ్యక్తం చేసింది.
తమిళనాడుకు చెందిన అప్సర డిగ్రీ పూర్తి చేసిన అనంతరం సినీరంగంలో అవకాశాలను వెతుకుతూ 2022లో హైదరాబాద్కు వచ్చింది. తల్లితో కలిసి సరూర్నగర్లో అద్దె ఇంట్లో నివసించేది. ఆమెకి దైవభక్తి ఎక్కువగా ఉండటంతో తరచూ దేవాలయాలకు వెళ్లడం జరిగేది.. అక్కడ పూజారి సాయికృష్ణతో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది.
కానీ, అప్సర పెళ్లి చేసుకోమని ఒత్తిడి పెంచడంతో పూజారి సాయికృష్ణ ఆమెను హత్య చేసేందుకు పలు మార్లు ప్లాన్ వేసాడు. చివరికి 2023 జూన్లో శంషాబాద్లో ఆమెను హత్య చేసి, మృతదేహాన్ని సరూర్నగర్ మైసమ్మ ఆలయం సమీపంలోని మ్యాన్హోల్లో పడేసి, రెండు ట్రక్కుల ఎర్రమట్టి తెప్పించి దానిపై కాంక్రీట్ వేసి అచ్చంగా కనపడకుండా మూసేశాడు.
అయితే స్థానికులు వాసన గుర్తించి అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. అప్సర అదృశ్యమైన వ్యవహారాన్ని విచారణ చేయగా అసలు కథ బయటపడింది. పోలీసులు ఆధారాలను సేకరించి, చార్జీషీట్ దాఖలు చేశారు. కోర్టులో అన్ని ఆధారాలను పరిశీలించిన అనంతరం నిందితుడిని దోషిగా నిర్ధారించి జీవిత ఖైదు విధించింది.
ఈ తీర్పు దేశంలో అరుదైన కేసుగా నిలిచింది. ఓ హత్య కేసులో బాధిత కుటుంబానికి రూ.10 లక్షల నష్టపరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించడం ఇదే మొదటిసారి. బాధిత కుటుంబం న్యాయపరంగా తమ కుమార్తెకు న్యాయం జరిగిందని భావించి హర్షం వ్యక్తం చేసింది. ఈ తీర్పుతో అప్సర ఆత్మకు శాంతి చేకూరుతుందని ఆమె తండ్రి అన్నాడు.