Nehru Zoological Park: సందర్శకులకు బ్యాడ్ న్యూస్
Nehru Zoological Park: నెహ్రూ జూపార్క్ సందర్శకులకు తెలంగాణ ప్రభుత్వం షాక్ ఇచ్చింది . హైదరాబాద్లోని ప్రముఖ పర్యాటక ప్రదేశమైన నెహ్రూ జూపార్క్ టికెట్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న జూపార్క్ టికెట్ల ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. జూపార్క్ టికెట్ ధరను సాధారణ రోజుల్లో పెద్దలకు రూ.70, పిల్లలకు రూ. 45కు పెంచారు. సెలవులు, వీకెండ్స్లో పెద్దలకు రూ.80, పిల్లలకు రూ.55కు టికెట్ ధరలను పెంచాలని నిర్ణయించారు. పెంచిన టిక్కెట్ ధరలను త్వరలో అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే ఎప్పటిలోగా పెంచుతారనే దానిపై ఇంకా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. వేసవి దృష్ట్యా, జంతుప్రదర్శనశాల రద్దీగా ఉంటుంది. విద్యాసంస్థలకు సెలవు కావడంతో పిల్లలను జూపార్కుకు తీసుకెళ్తారు. వేసవి కాలం కావడంతో చల్లదనాన్ని ఆస్వాదించేందుకు, వివిధ రకాల పక్షులు, జంతువులను చూసేందుకు చాలా మంది సందర్శకులు జూకు వస్తుంటారు.
Also Watch This:
సందర్శకుల తాకిడితో ఆదాయం పెరుగుతుందని అటవీశాఖ భావిస్తోంది. అందులో భాగంగానే టిక్కెట్ ధరలను పెంచినట్లు తెలుస్తోంది. టిక్కెట్ ధరల పెంపుపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఇటీవల జూ పార్క్ అథారిటీతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జూపార్క్ టిక్కెట్ల ధరల పెంపుపై చర్చలు జరిగాయి. పార్కు నిర్వహణ, సిబ్బంది వేతనాలు మెరుగుపరచడంతోపాటు పార్కును మరింత మెరుగ్గా తీర్చిదిద్దేందుకు ప్రవేశ టికెట్ ధరలను పెంచాలని నిర్ణయించారు. ఈ జూపార్క్ తెలంగాణ అటవీశాఖ ఆధ్వర్యంలో నడుస్తోంది. దేశంలోని అతిపెద్ద పార్క్లలో ఇది కూడా స్థానం దక్కించుకుంది. ఈ పార్క్లో అన్ని రకాల పక్షులు, జంతువులు, సర్పాలు ఉన్నాయి. దాదాపు 380 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ పార్క్.. నగరంలో ప్రముఖ పర్యాటక ప్రదేశంగా పేరు పొందింది. దాదాపు 1500 జాతుల జంతువులు ఈ పార్క్లో ఉన్నాయి. 1963లో ఈ జూ పార్క్ను ప్రారంభించారు.
జూపార్క్లోని టైగర్ జోన్లోకి వెళ్లాలంటే ఎంట్రీ టికెట్ కాకుండా ప్రత్యేకంగా టికెట్ కొనుగోలు చేయాల్సి ఉంది. లోపల ఉండే క్యాంటీన్లలో ఆహార పదార్థాలు లభిస్తాయి. ఇటీవల వర్షాల కారణంగా జూపార్క్కు సందర్శకుల తాడికి తగ్గినా మళ్లీ ఉష్ణోగ్రతలు పెరిగి ఎండ ప్రభావం మొదలైతే పర్యాటకుల సంఖ్య పెరుగుతుంది. ఇక శని, ఆదివారాలు, పండుగ సెలవు రోజుల్లో రద్దీ బాగా ఎక్కువగా ఉంటుంది. టికెట్ ధరల ద్వారా రాష్ట్ర అటవీశాఖకు కూడా భారీగా ఆదాయం వస్తోంది అని భావిస్తున్నారు .