తెలుగు రాష్ట్రాల ప్రజలు చాలా కాలం నుంచి కల్తీ నూనెల బారిన పడి అటు ఆరోగ్యం.. ఇటు డబ్బు నష్టపోతున్నారు. టాస్క్ ఫోర్స్ పోలీసులు ఎన్ని సార్లు దాడులు చేసి పట్టుకుంటున్నా, నగరంలో ఏదో ఒక చోట ఈ కల్తీ నూనెల దందా యధేచ్చగా జరుగుతుంది. ఇక హలీమ్ సీజన్ షురూ అవ్వడంతో..! ఆయిల్కి డిమాండ్ పెరిగింది..! అలాగే ఉగాది కూడా రావడంతో కల్తీగాళ్లు రెచ్చిపోయి యధేచ్చగా బ్రాండెడ్ లేబుల్స్ ను అనుకరిస్తూ… అసలు నకిలీ కనుక్కోలేని విధంగా చిన్న మార్పలు చేసి కల్తీ నూనెల అమ్మకంతో రెచ్చి పోతున్నారు. బ్రాండ్ పేరును కాస్త అటూ.. ఇటుగా మార్పులు చేసి కల్తీ నూనె సప్లై చేస్తూ ప్రజల ఆరోగ్యానికి బ్యాండ్ వేస్తున్నారు.
హైదరాబాద్ మలక్పేటలో వెలుగు చూసిన ఈ ఘటన షాక్కు గురిచేస్తోంది. డిస్ట్రిబ్యూషన్ సెంటర్ పేరుతో నడుస్తున్న నూనెల దందా పోలీసులనే అవాక్కయ్యేలా చేస్తోంది. హైదరాబాద్ మహబూబ్ మాన్షన్గా పిలిచే మలక్పేట గంజ్ మార్కెట్లో అక్రమ దందా గుట్టు రట్టు చేశారు సౌత్ ఈస్ట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. ప్రముఖ కంపెనీల పేరుతో అందమైన ప్యాకింగులు, కంపెనీల లేబుళ్లతో పాటు నాణ్యతా ప్రమాణాలను పాటిస్తున్నామనే డిస్ట్రిబ్యూటర్ల ప్రకటనలు వట్టి బూటకమని టాస్క్ఫోర్స్ పోలీసుల సోదాల్లో తేలింది. నాసిరకం వంటనూనెకు కంపెనీ లేబుళ్లు వేసి నాణ్యమైన వంట నూనెగా అమ్ముతున్నారు ఈ కల్తీ కేటుగాళ్లు.
ఇక హలీమ్ సీజన్ కావడంతో లారీలకొద్దీ కల్తీ నూనె షాపులకు తరలిస్తున్నారు. మలక్పేటలోని శ్రీ గణేష్ బాలాజీ ఆయిల్ కంపెనీ షాపుపై దాడులు నిర్వహించిన సౌత్ ఈస్ట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు…షాకింగ్ విషయాలు వెల్లడించారు. అధిక లాభాల కోసం వంట నూనె కల్తీ చేసి అక్రమ దందా చేస్తున్నారని గుర్తించారు. ప్రముఖ ఆయిల్ కంపెనీ డిస్ట్రిబ్యూటర్గా చెప్పుకుంటూ రెచ్చిపోతున్నారని తెలిపారు. గోడౌన్ డ్రమ్ముల్లో ఉన్న నూనెను 20 లీటర్ల క్యానుల్లో హోటళ్లకు తరలిస్తున్నట్లు తేల్చారు. అంతేకాదు పేరున్న ప్రముఖ కంపెనీల కార్టన్లను పోలి ఉన్న ఖాళీ అట్టపెట్టెలు, ఆ కంపెనీల లేబుళ్లు గుట్టలుగా పడి ఉండటం చూసి అవాక్కయ్యారు.
గోదాము నిండా ఆయిల్ నింపని నూనె డబ్బాలు దర్శనమివ్వడంతో.. అసలీ దందా ఎప్పటినుంచి జరుగుతోంది? ఇప్పటివరకూ ఎంత కల్తీ నూనె సప్లై చేశారన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.