పహల్గాం ఉగ్రదాడి దేశవ్యాప్తంగా కలకలం రేపిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం హైఅలర్ట్ మోడ్లోకి వెళ్లింది. భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో దేశ భద్రత అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ కీలకంగా స్పందించారు. బుధవారం ప్రధానమంత్రి అధ్యక్షతన క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ (CCS) భేటీ జరగనుంది. ఈ సమావేశంలో పహల్గాం దాడికి సంబంధించి సమగ్ర నివేదికలతో పాటు, భద్రతా వ్యవస్థను మరింత కఠినతరం చేయాలన్న దిశగా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని అధికార వర్గాలు భావిస్తున్నాయి. ఇదివరకు పహల్గాం ఘటన తరువాత ఇప్పటికే ఒకసారి CCS సమావేశం జరిగిన విషయం తెలిసిందే.
ఇంతకీ ఈ దాడి వెనక అసలు చేతులు ఎవరివన్న విషయంపై ప్రస్తుతం విచారణ బలంగా సాగుతోంది. ఇందులో పాల్గొన్న నలుగురు ఉగ్రవాదుల్లో హషిమ్ మూసా అనే వ్యక్తి పాకిస్థాన్ ఆర్మీకి చెందిన పారా కమాండో అని భారత నిఘా సంస్థలు గుర్తించాయి. ప్రస్తుతం అతను లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థలో కీలక సభ్యుడిగా ఉన్నాడని వెల్లడించాయి. అంతేకాకుండా టీఆర్ఎఫ్ అనే మరో ఉగ్రవాద సంస్థ హషిమ్ను ప్రత్యేకంగా ఎంపిక చేసి, కశ్మీర్లో దాడులు చేయడానికి పంపించిందని తెలుస్తోంది.
ఈ నేపధ్యంలో భారత సైన్యం కశ్మీర్లో గట్టి దాడులకు పాల్పడుతోంది. ఇప్పటికే అనుమాస్పదులైన వందలాది మందిని అదుపులోకి తీసుకుంది. విచారణలో భాగంగా హషిమ్ మూసా గురించి పలువురు స్థానికులు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. గతంలో పాక్ సైన్యంలో స్పెషల్ సర్వీస్ గ్రూప్లో పనిచేసిన హషిమ్, అనంతరం ఉగ్రవాద మార్గంలోకి వెళ్లి లష్కరేలో కీలకంగా మారినట్లు దర్యాప్తు బృందం చెబుతోంది. ఈ విషయమంతా పాక్ ఆర్మీకి, ఉగ్రవాద సంస్థలకు మధ్య ఉన్న అనుబంధాన్ని బట్టబయలు చేస్తున్నదని అధికారులు అంటున్నారు.
ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ తీసుకోబోయే నిర్ణయాలపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. సరిహద్దు భద్రతను మరింత పటిష్ఠంగా మారుస్తారా? ఉగ్రవాదులపై ప్రతీకార చర్యలు తీసుకుంటారా? అనే ప్రశ్నలు ప్రతి పౌరుని మనసులో తిరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో దేశ భద్రతకు సంబంధించి మరో కీలక దశ ప్రారంభం కానుందనే సూచనలుగా ఈ పరిణామాలు కనిపిస్తున్నాయి.