Virat Kohli: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్‌పై బిగ్ క్లారిటీ.. 2027 వరల్డ్ కప్‌ గురించి ఏం చెప్పాడో తెలుసా..?

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన రిటైర్మెంట్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. క్రికెట్ అభిమానులందరూ అతని భవిష్యత్తుపై ఆసక్తిగా ఎదురుచూస్తుండగా, కోహ్లీ మాత్రం 2027 వరల్డ్ కప్‌ను తన తదుపరి పెద్ద లక్ష్యంగా ప్రకటించాడు. దీంతో అతని అభిమానుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

ఐపీఎల్ 2025 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో బిజీగా ఉన్న కోహ్లీ, ఇటీవల ఓ ఈవెంట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోస్ట్ “మీ నెక్ట్స్ బిగ్ స్టెప్ ఏమిటి?” అని ప్రశ్నించగా, కోహ్లీ ఒక్కసారిగా “2027 వరల్డ్ కప్ గెలవడమే నా ప్రధాన లక్ష్యం” అంటూ సమాధానం ఇచ్చాడు. కోహ్లీ వ్యాఖ్యలు విన్న అభిమానులు ఆనందంతో హర్షధ్వానాలు చేశారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వన్డే క్రికెట్‌కు వీడ్కోలు పలికే అవకాశముందని, ముఖ్యంగా 2025 ఛాంపియన్స్ ట్రోఫీ అనంతరం వీరిద్దరూ రిటైర్ అవుతారని గతంలో ఊహాగానాలు వచ్చాయి. కానీ కోహ్లీ తాజా ప్రకటనతో ఆ వార్తలకు తెరపడినట్లైంది. 2027 వరల్డ్ కప్ టార్గెట్ గా పెట్టుకున్న కోహ్లీ, అప్పటి వరకు వన్డే ఫార్మాట్‌లో కొనసాగనున్నట్లు స్పష్టమైంది.

ఇదిలా ఉండగా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ సీజన్‌లో అద్భుత ప్రదర్శన కనబరుస్తోంది. ప్రస్తుత ఐపీఎల్‌లో ఆర్సీబీ వరుస విజయాలతో ముందుకు దూసుకెళ్తోంది. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో 17 ఏళ్ల తర్వాత ఆర్సీబీ విజయం సాధించడం కోహ్లీ & కోకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది.

కోహ్లీ 2027 వరల్డ్ కప్‌పై చేసిన ప్రకటనతో అభిమానులు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. రానున్న రోజుల్లో కోహ్లీ ఎలా ఆడతాడో చూడాలి!

Leave a Reply