ఐపీఎల్ 2025 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రాజస్థాన్ రాయల్స్పై 9 వికెట్ల తేడాతో గెలిచింది. జైపూర్లో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ 62 పరుగులతో అజేయంగా నిలిచాడు. అయితే మ్యాచ్లో జరిగిన ఓ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆర్సీబీ ఇన్నింగ్స్ 15వ ఓవర్లో కోహ్లీ రెండు పరుగులు తీయడంతో గట్టిగా శ్వాస తీసుకున్నాడు. ఆ వెంటనే అతను వికెట్ కీపర్ సంజూ శాంసన్ దగ్గరకు వెళ్లి “నా హార్ట్ బీట్ చెక్ చెయ్” అంటూ తన ఛాతీపై చూపించాడు. శాంసన్ గ్లోవ్స్ తీసి కోహ్లీ ఛాతీపై చేయి వేసి బీట్ను చెక్ చేసి “అన్నీ ఓకే” అని సమాధానం ఇచ్చాడు. ఈ అనూహ్య సంఘటన చూసి అభిమానులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు.
Kohli asking Sanju to check his heartbeat? What was this 😳 pic.twitter.com/2vodlZ4Tvf
— Aman (@AmanHasNoName_2) April 13, 2025
ఈ వీడియో వైరల్ కావడంతో “కోహ్లీకి ఏమైంది?”, “గుండె కి సంబంధించిన సమస్య ఏదైనా ఉందా?”, అని నెటిజన్లు చర్చిస్తున్నారు. కానీ తీవ్రమైన ఎండల కారణంగా కోహ్లీ డీహైడ్రేషన్కు లోనై ఉండే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇంకో విశేషం ఏమిటంటే, కోహ్లీ చేసిన ఈ హాఫ్ సెంచరీ టీ20ల్లో అతడి వందో హాఫ్ సెంచరీ కావడం విశేషం. దీంతో డేవిడ్ వార్నర్ (108) తర్వాత అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు.
టీ20ల్లో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన ఆటగాళ్లు:
డేవిడ్ వార్నర్ – 108
విరాట్ కోహ్లీ – 100
బాబర్ అజమ్ – 90
క్రిస్ గేల్ – 88
జోస్ బట్లర్ – 86
మ్యాచ్ హైలైట్స్:
రాజస్థాన్ రాయల్స్ 173/4 స్కోర్ చేసింది. జైస్వాల్ 75 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అనంతరం ఆర్సీబీ బ్యాటర్లు ఫిల్ సాల్ట్ (65), కోహ్లీ (62*), పడిక్కల్ (40*) అద్భుత ప్రదర్శనతో లక్ష్యాన్ని 17.5 ఓవర్లలో చేధించారు.