ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్నా, సన్రైజర్స్ హైదరాబాద్ మాత్రం గెలుపు పయనం ఆపలేదు. ఐపీఎల్ 2025 సీజన్ చివరి మ్యాచ్లో ఆర్సీబీపై 42 పరుగుల తేడాతో గెలిచింది. ఈ విజయంతో సీజన్ను ఘనంగా ముగించింది.
ఆర్సీబీ తో జరిగిన ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ భారీ స్కోర్ నమోదు చేసింది. 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 231 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ 94 పరుగులతో నాటౌట్గా నిలవగా, అభిషేక్ శర్మ 34, క్లాసెన్ 24, అనికేత్ శర్మ 26 రాణించారు. నితీశ్ కుమార్ రెడ్డి (4) తప్పించి ప్రధాన బ్యాటర్లంతా విలువైన పరుగులు సాధించారు.
ఆర్సీబీ బౌలింగ్లో షెఫర్డ్ 2 వికెట్లు తీయగా, కృనాల్ పాండ్య, సుయాశ్ శర్మ, లుంగి ఎంగిడి, భువనేశ్వర్ కుమార్ తలో వికెట్ తీశారు.
231 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు ఓపెనర్లు శుభారంభం అందించినా, మధ్యలో వెనకడుగు వేసింది. ఫిల్ సాల్ట్ 32 బంతుల్లో 62 పరుగులు (4×4, 5×6), విరాట్ కోహ్లి 25 బంతుల్లో 43 పరుగులు (7×4, 1×6) చేశారు. అయితే సాల్ట్ ఆరంభంలో కుదురుకోవడానికి ఎక్కువ బంతులు తీసుకోవడంతో రన్రేట్ ఒత్తిడికి గురైంది. మిగతా బ్యాటర్లు నిరాశపరచడంతో జట్టు 19.5 ఓవర్లలో 189 పరుగులకే ఆలౌట్ అయింది.
హైదరాబాద్ బౌలింగ్ విభాగం రాణించింది. కమిన్స్ 3/28తో అద్భుతంగా రాణించగా, ఇషాన్ మలింగ 2/37, నితీశ్ కుమార్ రెడ్డి 1/13, హర్ష్ దూబే 1/20తో బౌలింగ్ దళాన్ని సమర్థంగా నడిపించారు.
ఈ విజయంతో ఎస్ఆర్హెచ్ అభిమానులకు మిగిలిన గౌరవాన్ని నిలబెట్టింది. సీజన్ ప్రారంభంలో సెంచరీ చేసిన ఇషాన్ కిషన్ ఈ మ్యాచ్లో మళ్లీ తానేంటో చూపించాడు. సీజన్ ముగింపు మ్యాచ్లో హైదరాబాద్ పూర్తి ఆధిపత్యాన్ని చాటింది.