Smriti Mandhana: టీ20ల్లో అరుదైన ఘనత సాధించిన స్మృతి మంధాన..!

టీమిండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. భారత్ తరఫున అత్యధిక టీ20 మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్ల జాబితాలో ఆమె మూడో స్థానానికి ఎగబాకింది. మంధానకు ఇది భారత్ తరఫున 150వ టీ20 మ్యాచ్ కావడం విశేషం.

ఈ జాబితాలో హర్మన్‌ప్రీత్ కౌర్ (179 మ్యాచ్‌లు) అగ్రస్థానంలో ఉండగా, రోహిత్ శర్మ (159 మ్యాచ్‌లు) రెండో స్థానంలో ఉన్నారు. తాజాగా ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టీ20లో బరిలోకి దిగిన మంధాన, ఈ మైలురాయిని అందుకుంది.

మ‌హిళ‌ల అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్ల జాబితాలో మంధాన ఏడో స్థానంలో నిలిచింది. తొలి ఆరు స్థానాల్లో ఉన్నవారిలో హర్మన్‌ప్రీత్ కౌర్, సుజీ బేట్స్, డానీ వ్యాట్, ఎలిస్ పెర్రీ, అలిస్సా హీలీ, నిదా దార్ లు ఉన్నారు.

అత్యధిక మహిళల అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్లు:
హర్మన్‌ప్రీత్ కౌర్ (భారత్) – 179

సుజీ బేట్స్ (న్యూజిలాండ్) – 177

డానీ వ్యాట్ (ఇంగ్లాండ్) – 175

ఎలిస్ పెర్రీ (ఆస్ట్రేలియా) – 168

అలిస్సా హీలీ (ఆస్ట్రేలియా) – 162

నిదా దార్ (పాకిస్తాన్) – 160

స్మృతి మంధాన (భారత్) – 150

ఇంగ్లాండ్‌పై భారత్ ఘనవిజయం
మ్యాచ్ విషయానికి వస్తే, టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత మహిళల జట్టు 20 ఓవర్లలో 181/4 స్కోర్ చేసింది. జెమీమా రోడ్రిగ్స్ (63), అమన్‌జోత్ కౌర్ (63 నాటౌట్) అర్ధ సెంచరీలతో రాణించారు.

తదనంతరం లక్ష్యచేధనకు దిగిన ఇంగ్లాండ్ జట్టు 157/7 వద్దే నిలిచింది. దీంతో భారత్ 24 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్ 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

Leave a Reply