RCB vs KKR: ఆర్సీబీ గెలిస్తే చరిత్రే! ప్లేఆఫ్స్‌కు తొలి టికెట్, కోల్‌కతాకు ‘డు ఆర్ డై’ మ్యాచ్!

ఐపీఎల్ 2025 సీజన్‌లో వారం రోజుల విరామం తర్వాత మళ్లీ పోటీ పెరగనుంది. మే 17 (శనివారం) నాటికి కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) మరియు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య కీలకమైన మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ గెలిస్తే, ఈ సీజన్‌లో ప్లేఆఫ్స్‌కు చేరిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించనుంది.

అయితే, బెంగళూరులో వర్షం కారణంగా మ్యాచ్ రద్దయినా కూడా ఆర్సీబీకి ప్లేఆఫ్స్ టికెట్ ఖాయమే. ఇప్పటివరకు ఒక్క ఐపీఎల్ సీజన్‌లోనూ ఆర్సీబీకి ఇలా ముందుగానే ప్లేఆఫ్స్ అర్హత లభించిన ఉదాహరణ లేదు.

కోల్‌కతా కు ‘డు ఆర్ డై’ మ్యాచ్
ఇక కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ఈ మ్యాచ్ బహుళ కీలకం. 2024 ఐపీఎల్ చాంపియన్‌గా నిలిచిన కోల్‌కతా ఈసారి ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే తప్పకుండా గెలవాల్సిన అవసరం ఉంది. ఓటమి పాలైతే ఆ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించే ప్రమాదం ఉంది.

ప్రస్తుతం ప్లేఆఫ్ పోటీ తీవ్రంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు జరిగిన 57 మ్యాచ్‌లలో గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్లు టాప్-3లో ఉన్నాయి. గుజరాత్, బెంగళూరు జట్లకు తలా 16 పాయింట్లు, పంజాబ్‌కు 15 పాయింట్లు ఉన్నాయి. కోల్‌కతా 12 మ్యాచ్‌ల్లో 11 పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది.

ఆర్సీబీ vs కేకేఆర్: హెడ్ టు హెడ్ రికార్డ్
ఇప్పటివరకు ఈ రెండు జట్లు 35 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. వాటిలో కోల్‌కతా 20 గేమ్స్‌లో విజయం సాధించగా, బెంగళూరు 15 మ్యాచ్‌లను గెలిచింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం కోల్‌కతాకు అనుకూలమే. అక్కడ ఆడిన 15 మ్యాచ్‌లలో 10 విజయాలు సాధించింది.

ఈ నేపథ్యంలో, ఈరోజు మ్యాచ్ రెండు జట్ల భవిష్యత్తును నిర్ణయించేలా మారుతోంది. అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

Leave a Reply