IPL 2025 Cancel: ఐపీఎల్ ఆపేస్తారా? ధర్మశాలలో హడావుడి.. బీసీసీఐ కీలక ప్రకటన!

ఇండియా – పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నడుస్తుండగా, దాని ప్రభావం భారత క్రికెట్‌పై కూడా పడుతోంది. ఐపీఎల్ 2025 సీజన్ అత్యంత ఉత్కంఠభరితంగా సాగుతున్న సమయంలో, మే 8న పంజాబ్‌లోని ధర్మశాల వేదికగా జరగాల్సిన పంజాబ్ కింగ్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్‌ ను మధ్యలోనే నిలిపివేయడం సంచలనం రేపింది.

అదే రోజు సాయంత్రం బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా మీడియాతో స్పందిస్తూ, “మనకు ఆటకంటే ముందు భద్రత ముఖ్యం. భారతీయులు, విదేశీ ఆటగాళ్లు, సహాయక సిబ్బంది, అభిమానుల ప్రాణ భద్రతను దృష్టిలో ఉంచుకుని మ్యాచ్‌ను రద్దు చేయాల్సి వచ్చింది” అని చెప్పారు. స్టేడియం వద్ద అనుమానాస్పదమైన కదలికలు, ఆందోళన కలిగించే సమాచారం రావడంతో వెంటనే స్టేడియాన్ని ఖాళీ చేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు.

ఇదే సమయంలో, సోషల్ మీడియాలో ఒక వార్త హల్‌చల్ చేస్తోంది – ఐపీఎల్ మొత్తం టోర్నీనే రద్దు చేస్తారన్న అనుమానం. దీనిపై స్పందించిన సైకియా, “ఈ దారుణమైన వార్తలు నమ్మకండి. మేము ఒక్కో మ్యాచ్‌ను పరిస్థితుల ఆధారంగా పరిశీలిస్తున్నాం. ప్రస్తుతం మొత్తం టోర్నమెంట్ రద్దు చేసే ప్రసక్తే లేదు” అని స్పష్టంచేశారు.

ఈ పరిణామాలపై ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమల్ కూడా స్పందించారు. “ప్రస్తుతం మేము ప్రతి మ్యాచ్‌కు ముందు భద్రతా పరిస్థితులను సమీక్షిస్తున్నాం. ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదు. అయినా మేము ఆటగాళ్లు, అభిమానుల రక్షణపై అస్సలు తక్కువగా చూడడం లేదు. పరిస్థితి మారితే వెంటనే నిర్ణయం తీసుకుంటాం” అని వెల్లడించారు.

అదే సమయంలో నిన్నటి మ్యాచ్ తర్వాత ఓ “ఎమర్జెన్సీ మీటింగ్ జరిగింది” అనే వార్తలపై స్పందించిన దేవజిత్, “అలాంటి మీటింగ్ ఏమీ జరగలేదు. మేమంతా వేరే వేరే ప్రదేశాల్లో ఉన్నాం. ఒకే విషయాన్ని చాలామంది తప్పుగా అన్వయించుకున్నారు. ధర్మశాలలో మ్యాచ్ ఆందోళన కలిగించిందనే కారణంతోనే ఆ మ్యాచ్‌ను నిలిపివేశాం. దయచేసి అసత్యాలను వ్యాపించకుండా చూడండి” అన్నారు.

ఈ పరిణామాల నేపథ్యంలో అభిమానుల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. సోషల్ మీడియాలో ‘#CancelIPL’, ‘#WarOverCricket’, ‘#IPLUnderThreat’ లాంటి హ్యాష్‌ట్యాగ్స్ ట్రెండ్ అవుతుండగా, మరికొంతమంది అభిమానులు “భారత్ భద్రతే ముఖ్యం, ఐపీఎల్ రద్దయినా పరవాలేదు” అంటూ దేశభక్తిని చాటుతున్నారు.

ప్రస్తుతం మే 9 (శుక్రవారం) నాటి మ్యాచ్ షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందని బీసీసీఐ తెలిపినా, ఒకవేళ పరిస్థితులు అదుపుతప్పితే, మరిన్ని మ్యాచ్‌లు రద్దయ్యే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం, హోం మంత్రిత్వ శాఖ సూచనలపై ఆధారపడి బీసీసీఐ తదుపరి చర్యలు తీసుకోనుంది. అన్నీ భద్రతా మార్గదర్శకాలను అనుసరించి నిర్ణయాలు తీసుకుంటామని అధికారుల వ్యాఖ్యలు వెల్లడించాయి.

Leave a Reply