ఐపీఎల్ 2025 మెగా వేలంలో అత్యధిక ధరకు (రూ.27 కోట్లు) లక్నో సూపర్ జెయింట్స్ కొనుగోలు చేసిన రిషబ్ పంత్ నిరాశ పరుస్తున్నాడు. ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచుల్లో కలిపి కేవలం 17 పరుగులే చేశాడు. ఢిల్లీ క్యాపిటల్స్పై డకౌట్, సన్రైజర్స్పై 15, పంజాబ్ కింగ్స్పై 2 పరుగులతో అతని బ్యాటింగ్ పూర్తిగా విఫలమైంది.
పంత్కు బ్యాటింగ్లోనే కాదు, కెప్టెన్సీలోనూ ఏమాత్రం ప్రభావం చూపించలేకపోతున్నాడనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లక్నో అభిమానులు సోషల్ మీడియాలో అతనిపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. భారీ మొత్తం వెచ్చించి కొనుగోలు చేయగా, ఇలా ఫ్లాప్ అయితే జట్టుకు నష్టమేనని చెబుతున్నారు. అతను ఓవర్ రేటెడ్ ప్లేయర్ అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.
గాయం కారణంగా గత కొంతకాలంగా ఆటకు దూరమైన పంత్, ఐపీఎల్ 2025లో తిరిగి గ్రౌండ్లోకి అడుగుపెట్టాడు. అయితే, ఫామ్ మాత్రం పూర్తిగా కోల్పోయినట్లు కనిపిస్తోంది. ఐపీఎల్కు ముందు జనవరిలో ఒక రంజీ మ్యాచ్ ఆడినప్పటికీ, అతని ఆటతీరు ఏమాత్రం మెరుగవలేదు. ఆ మ్యాచ్లో రెండు ఇన్నింగ్స్ల్లో కలిపి 18 పరుగులే చేశాడు.
Scene created between Goenka & Pant. 🧐#PBKSvsLSG pic.twitter.com/oU9AS4kbN5
— Kunal Yadav (@Kunal_KLR) April 1, 2025
అంతకు ముందు అక్టోబర్ నుంచి పరిమిత ఓవర్ల ఫార్మాట్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడని పంత్, ఐపీఎల్లో ప్రత్యర్థుల బౌలింగ్కు ఎదురు నిలవలేకపోతున్నాడు.
రిషబ్ పంత్ ఇప్పటివరకు 114 ఇన్నింగ్స్ల్లో 34.39 సగటుతో 3301 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 18 అర్ధ సెంచరీలు ఉన్నాయి. గత సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున 13 మ్యాచుల్లో 40.55 సగటుతో 446 పరుగులు చేశాడు. స్ట్రైక్ రేట్ 155.40. కానీ ఈ సీజన్లో మాత్రం అతని బ్యాటింగ్ పూర్తిగా అస్తవ్యస్తంగా మారింది.
లక్నో అతనిపై భారీ పెట్టుబడి పెట్టినప్పటికీ, అతని ఆటతీరు ఆశించిన స్థాయికి చేరడం లేదు. ఫ్యాన్స్, క్రికెట్ విశ్లేషకులు అతని ప్రదర్శనపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇకముందు మ్యాచుల్లోనైనా పంత్ ఫామ్లోకి రాకపోతే, లక్నో జట్టు పెద్ద సమస్యను ఎదుర్కొనాల్సి వస్తుందని స్పష్టంగా కనిపిస్తోంది.
ఇకనైనా పంత్ పుంజుకుంటాడా? లేక ఐపీఎల్ 2025లో అతను టోర్నమెంట్లోనే అతికొద్ది పరుగులు చేసిన అత్యంత ఖరీదైన ఆటగాడిగా మిగిలిపోతాడా? అనేది చూడాలి..