IPL 2025 Winner: 18 ఏళ్ల కల నెరవేరింది.. RCB ఐపీఎల్ ఛాంపియన్‌గా చరిత్ర సృష్టించింది!

కోట్లాది మంది అభిమానుల కల నేడు నెరవేరింది. 18 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తొలిసారి IPL ట్రోఫీని కైవసం చేసుకుంది. ‘‘ఈ సాలా కప్ నమ్దే’’ అంటూ సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేవు.

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన హై వోల్టేజ్ ఫైనల్లో పంజాబ్ కింగ్స్‌పై RCB 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదటి బంతి నుంచి చివరి వరకూ ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఒక్కొక్క సమయంలో మ్యాచ్ దిశ మారినట్లు కనిపించింది. కానీ చివరికి విజయ తీరాన్ని RCBనే అందుకుంది.

టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన RCB, ఆరంభంలో ధాటిగా ఆడి తర్వాత స్థిరపడింది. ఈ మ్యాచ్‌లో 190 పరుగుల లక్ష్యాన్ని నిలబెట్టింది. విరాట్ కోహ్లీ కేవలం 43 పరుగులు చేసినా, దాని విలువ ఎంతో ఎక్కువైంది. ఓవైపు నెమ్మదిగా ఆడినట్టు విమర్శలు వచ్చినా, ఆయన కట్టుదిట్టమైన ఆట RCB విజయంలో కీలకం అయింది.

191 పరుగుల ఛేదనలో పంజాబ్ శరవేగంగా ఆరంభించింది. ఫోర్‌తో మొదలుపెట్టి ఆశలు పెంచింది. కానీ 43 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన తర్వాత పంజాబ్ ఇన్నింగ్స్ పూర్తిగా చతికిలపడింది. ఫిల్ సాల్ట్ క్యాచ్‌తో ప్రియాన్ష్ ఆర్య ఔట్ కాగా, క్రునాల్ పాండ్యా రెండు కీలక వికెట్లు తీసి మ్యాచ్ మలుపు తిప్పాడు. ఆపై శ్రేయస్ అయ్యర్‌ను షెపర్డ్ కేవలం ఒక పరుగు వద్ద ఔట్ చేశాడు. అదే మ్యాచ్ టర్నింగ్ పాయింట్ అయ్యింది.

ఆ వికెట్లతో పంజాబ్ పూర్తి కుదేలైంది. శశాంక్ సింగ్, స్టోయినిస్ వంటి కీలక బ్యాటర్లు ఉన్నా, ఒక్క పెద్ద భాగస్వామ్యం ఏర్పడలేదు. 26 పరుగుల వ్యవధిలో మూడు కీలక వికెట్లు కోల్పోవడం వల్ల రన్‌చేసే అవకాశం లేకపోయింది. మొత్తంగా 184 పరుగులకే పంజాబ్ పరిమితమైంది.

ఈ విజయంతో 2025 IPL సీజన్‌ను RCB తమ పేరుతో ముగించింది. 18 సీజన్ల నిరీక్షణ తర్వాత వారి పేరు ట్రోఫీపై చిరస్థాయిగా లిఖించబడింది. ఇది ఐపీఎల్ చరిత్రలో ఓ కొత్త అధ్యాయం. తొలిసారి అహ్మదాబాద్ ఫైనల్లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన జట్టు గెలిచిన ఘట్టంగా ఇది గుర్తింపు పొందింది.

Leave a Reply