ఆసియా కప్ సూపర్-4లో భాగంగా దుబాయ్ వేదికగా భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో టీమ్ ఇండియా ఘన విజయం సాధించింది. ఈ విజయానికి ప్రధాన కారణం బ్యాటర్ అభిషేక్ శర్మ అద్భుత ఇన్నింగ్స్ ఆడటం.
ముందుగా టాస్ గెలిచిన భారత జట్టు బౌలింగ్ ఎంచుకుంది. అయితే టాస్ సమయంలో టీమ్ ఇండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, పాక్ కెప్టెన్తో హ్యాండ్షేక్ చేయకపోవడం చిన్న సంచలనం రేపింది. రెండు జట్లు తమ జట్లలో మార్పులు చేశాయి. భారత్ తరఫున అర్ష్ దీప్ సింగ్, హర్షిత్ రాణా స్థానంలో జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి జట్టులోకి వచ్చారు. పాక్ జట్టు హుస్సేన్ తలత్, ఖుష్దిల్ షాలను ఆడించింది.
మొదట బ్యాటింగ్ చేసిన పాక్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ (58; 45 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్లు) అర్ధశతకంతో రాణించాడు. జమాన్ (15), అయూబ్ (21), నవాజ్ (21), ఫహీమ్ అష్రఫ్ (20*), సల్మాన్ (17*) రన్స్ చేశారు. భారత్ బౌలర్లలో శివమ్ దూబే 2 వికెట్లు, హార్దిక్, కుల్దీప్ చెరో వికెట్ తీశారు.
173 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ మొదటి నుంచే దూకుడు ప్రదర్శించింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్ ఆకర్షణీయ ఇన్నింగ్స్ ఆడారు. వరుసగా ఫోర్లు, సిక్స్లు బాదుతూ 10 ఓవర్లకే జట్టు 100 పరుగులు పూర్తి చేసింది. అయితే గిల్, కెప్టెన్ స్కై, అభిషేక్ శర్మ త్వరగా పెవిలియన్ చేరడంతో కొంత ఒత్తిడి వచ్చింది. సూర్యకుమార్ యాదవ్ డకౌట్గా వెనుదిరగగా, అభిషేక్ శర్మ 74 పరుగుల దగ్గర క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.
తర్వాత తిలక్ వర్మ, సంజూ శాంసన్ భాగస్వామ్యం కొనసాగించారు. సంజూ అవుట్ అయినా, తిలక్ చివర్లో దూకుడుగా ఆడి, ఒక సిక్స్, ఫోర్తో మ్యాచ్ను విజయవంతంగా ముగించాడు.