Ashwani Kumar: డెత్ ఓవర్లలో మాయ చేసిన అశ్వని కుమార్.. 30 లక్షల బిడ్డింగ్‌కు సూపర్ రిటర్న్..!

ముంబై ఇండియన్స్ ఎట్టకేలకు ఈ సీజన్‌లో తొలి విజయం నమోదు చేసుకుంది. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ముంబై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కోల్‌కతా బ్యాటర్లు పూర్తిగా విఫలమవ్వడంతో కేవలం 16.2 ఓవర్లలో 117 పరుగులకే ఆలౌటైంది. అనంతరం ముంబై బ్యాటర్లు ఆ లక్ష్యాన్ని కేవలం 12.5 ఓవర్లలో ఛేదించి కీలకమైన రెండు పాయింట్లు ఖాతాలో వేసుకున్నారు. ఓపెనర్ రోహిత్ (13) మరోసారి నిరాశపరిచినప్పటికీ, రికెల్టన్ (62*) అద్భుత ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. అతనికి జాక్స్ (16) మరియు సూర్యకుమార్ (27*) మద్దతుగా నిలిచారు. కోల్‌కతా బౌలర్లలో ఆండ్రీ రస్సెల్ రెండు వికెట్లు తీశాడు.

డెత్ ఓవర్ల స్పెషలిస్ట్.. అశ్వని కుమార్

కోల్‌కతా బ్యాటింగ్ కుప్పకూలటానికి ప్రధాన కారణం ముంబై కొత్త బౌలర్ అశ్వని కుమార్. ఈ 23 ఏళ్ల ఎడమచేతి ఫాస్ట్ బౌలర్ తన తొలి ఐపీఎల్ మ్యాచ్‌లోనే అదరగొట్టాడు. కేవలం 3 ఓవర్లలో 24 పరుగులకే 4 కీలక వికెట్లు తీసి కోల్‌కతాను కుప్పకూల్చాడు. డెత్ ఓవర్లలో బౌలింగ్ చేయడంలో తన ప్రత్యేకతను చూపించాడు. రహానే, రింకూ, మనీశ్, రస్సెల్‌లను పెవిలియన్‌కు పంపించి ముంబై విజయానికి గట్టి పునాదిని వేశాడు. అశ్వని తొలి ఐపీఎల్ మ్యాచ్‌లోనే 4 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. బుమ్రా తరహాలో మరో మాణిక్యాన్ని ముంబై ఇండియన్స్ కనుగొందిందంటూ క్రికెట్ అభిమానులు సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు.

మొహాలీ నుంచి ముంబైకి.. అశ్వని ప్రయాణం

పంజాబ్‌లోని మొహాలీలో జన్మించిన అశ్వని కుమార్ 2024లో షేర్-ఎ-పంజాబ్ టీ20 టోర్నమెంట్‌లో మెరిసి అందరి దృష్టిని ఆకర్షించాడు. దీంతో ముంబై ఇండియన్స్ అతనిని 2025 ఐపీఎల్ మెగా వేలంలో రూ. 30 లక్షలకు కొనుగోలు చేసింది. అయితే, 2024లో పంజాబ్ జట్టు కూడా అతనిని కొనుగోలు చేసినప్పటికీ, ఆడే అవకాశం ఇవ్వలేదు.

అశ్వని ఇప్పటివరకు 2 ఫస్ట్‌క్లాస్, 4 లిస్ట్-ఎ, 4 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. 2022 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో పంజాబ్ తరఫున అరంగేట్రం చేసిన అతను నాలుగు మ్యాచ్‌ల్లో 5.85 ఎకానమీ రేటుతో 3 వికెట్లు తీసి మంచి ప్రదర్శన చేశాడు. ఈ ఐపీఎల్‌లో అతను మరిన్ని అవకాశాలు పొందితే భారత జట్టుకు ఓ కీలక బౌలర్‌గా ఎదగొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.

Leave a Reply