ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలోని నార్త్ స్టాండ్పై ఉన్న మహ్మద్ అజహరుద్దీన్ పేరు తొలగించే ప్రక్రియకు హైకోర్టు బ్రేక్ వేసింది. ప్రస్తుతం ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ తెలంగాణ హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. న్యాయమూర్తి పుల్లా కార్తీక్ మంగళవారం ఇచ్చిన ఈ మధ్యంతర ఉత్తర్వులతో హెచ్సీఏ (హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్)కు చుక్కలు చూపించినట్లైంది.
ఇటీవల హెచ్సీఏ అంబుడ్స్మన్ జస్టిస్ వీ ఈశ్వరయ్య, హెచ్సీఏ మాజీ అధ్యక్షుడు అజహరుద్దీన్ స్వప్రయోజనాల కోసమే తన పేరును స్టాండ్కు పెట్టారని అభిప్రాయపడుతూ, ఆ పేరు తొలగించాలని ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. వారి ఆదేశాలను సవాల్ చేస్తూ అజహరుద్దీన్ హైకోర్టును ఆశ్రయించారు.
అజహరుద్దీన్ పిటిషన్పై హైకోర్టు స్పందన
ఈ నేపథ్యంలో అజహరుద్దీన్ తరఫున సీనియర్ న్యాయవాది కె. రమాకాంత్ రెడ్డి హాజరై, గత ఐదున్నర సంవత్సరాలుగా స్టాండ్ పేరుతో అజహరుద్దీన్ పేరు అమలులో ఉందని తెలిపారు. ఇలా అకస్మాత్తుగా తొలగించడం వల్ల ఆయన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలుగుతుందని, ఇది జీవించే హక్కును కూడా హరించడమేనని వాదించారు.
దీనికి ప్రత్యుత్తరంగా హెచ్సీఏ తరఫు న్యాయవాది, అజహరుద్దీన్ తన అధికారాన్ని ఉపయోగించి స్టాండ్కు తన పేరును పెట్టించారని వాదించారు. ఇది స్వప్రయోజనంగా మారిందని, హైకోర్టు ఎలాంటి మధ్యంతర ఉపశమనం ఇవ్వరాదని అభ్యర్థించారు.
తదుపరి ఆదేశాలు వచ్చే వరకూ చర్యలు వద్దు: హైకోర్టు
ఇరు వాదనలు విన్న హైకోర్టు, తదుపరి విచారణ వరకు స్టాండ్పై అజహరుద్దీన్ పేరును తొలగించే ప్రక్రియను నిలిపివేయాలని హెచ్సీఏకు ఆదేశించింది. తదుపరి విచారణ తేదీ వరకు ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది.