TDP vs Jana Sena: పిఠాపురంలో జనసేన-టీడీపీ మధ్య విభేదాలు.. రెండో రోజు కూడా నాగబాబుకు నిరసనల సెగ!

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ నియోజకవర్గమైన పిఠాపురంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇటీవలే ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన జనసేన నేత నాగబాబు, పిఠాపురంలో అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాల్లో భాగంగా రెండో రోజు పర్యటిస్తున్నారు. అయితే ఆయన పర్యటన ప్రతి అడుగులోనూ టీడీపీ కార్యకర్తల నిరసనలతో హీట్ పుట్టిస్తున్నారు.

పలు గ్రామాల్లో సీసీ రోడ్ల ప్రారంభోత్సవాల్లో పాల్గొన్న నాగబాబును, టీడీపీ శ్రేణులు ‘జై వర్మ’, ‘జై చంద్రబాబు’ నినాదాలతో ఎక్కడికక్కడ నిలదీశారు. గత రెండు రోజులుగా జనసేన-టీడీపీ శ్రేణుల మధ్య తోపులాటలు, వాగ్వాదాలు తీవ్రంగా జరుగుతున్నాయి.

వివాదానికి అసలు కారణం ఏమిటంటే?
పిఠాపురం టిడిపి ఇన్‌ఛార్జ్ వర్మను నాగబాబు అభివృద్ధి కార్యక్రమాలకు ఆహ్వానించకపోవడమే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. దీంతో టిడిపి నేతలు ఈ కార్యక్రమాలను బహిష్కరించడమే కాకుండా, నిరసన వ్యక్తం చేస్తూ, శిలాఫలకాల్లో చంద్రబాబు ఫోటో లేకపోవడంపై కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

నాగబాబు వ్యాఖ్యలే చిచ్చు పెట్టాయా?
ఇటీవల ఓ సమావేశంలో నాగబాబు చేసిన వ్యాఖ్యలు ఈ వివాదానికి మరింత ఆజ్యం పోశాయి. పవన్ కల్యాణ్ విజయానికి జనసేన కార్యకర్తలు, ప్రజలే కారణమని… కొంతమంది తామే గెలిపించామని క్రెడిట్ దక్కించుకునే ప్రయత్నం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇది టీడీపీ నేత వర్మను ఉద్దేశించే చేసిన కామెంట్‌గా ప్రచారం కావడం, అప్పటి నుంచి విభేదాలు ముదిరిపోయాయి.

కుమారపురం, కొత్తపల్లి, మాయాపట్నం, అమరవెల్లి ప్రాంతాల్లో ఉద్రిక్తతలు నాగబాబు పర్యటిస్తున్న ప్రతి ప్రాంతంలో టీడీపీ కార్యకర్తలు నినాదాలతో వాతావరణాన్ని ఉద్రిక్తం చేశారు. పోలీసుల భారీ బందోబస్తు మధ్య జనసేన నేతలు, కార్యకర్తలు కార్యక్రమాలు కొనసాగించాల్సి వచ్చింది. అయితే రెండు పార్టీల సీనియర్ నేతలు వివాదాలు ముదరకుండా చర్చలు జరిపినప్పటికీ, అంతర్గత విభేదాలు గట్టిగా బయటపడుతున్నాయి.

పిఠాపురం రాజకీయ సమీకరణాలు కుదుటపడాలంటే… జనసేన-టీడీపీ కూటమి సమష్టిగా ముందుకు సాగాలంటే ఈ రకమైన అంతర్గత విభేదాలను పరిష్కరించుకోవడం అత్యవసరం. లేదంటే స్థానిక రాజకీయాలు మరింత సంక్లిష్టంగా మారే అవకాశం ఉంది.

Leave a Reply