KTR: నన్ను అరెస్ట్ చేసుకోండి.. ఒక్కపైసా అవినీతి జరగలేదు.. ఏసీబీ విచారణ తర్వాత కేటీఆర్..!

‘‘నన్ను అరెస్ట్ చేయాలంటే చేసుకోండి.. అయినా ఒక్క పైసా అవినీతి జరగలేదు’’ అంటూ ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ విచారణ అనంతరం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగా స్పందించారు. హైదరాబాద్ బంజారాహిల్స్ ఏసీబీ కార్యాలయంలో సుమారు 7 గంటల పాటు జరిగిన రెండో విడత విచారణ అనంతరం మీడియాతో మాట్లాడారు.

ఈ సందర్భంగా ఆయన సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. ‘‘నాలుగు గోడల మధ్య కాదు నాలుగు కోట్ల ప్రజల మధ్య చర్చిద్దామని అసెంబ్లీలో అడిగితే పారిపోయారు. లై డిటెక్టర్ పరీక్షకైనా సిద్ధమని చెప్పినా స్పందనలేదు. విచారణ పేరుతో ఏసీబీ అధికారులు పైనుంచి రాసిచ్చిన ప్రశ్నలే అడిగారు. అవినీతి ఎక్కడ జరిగింది చెప్పలేకపోయారు,’’ అని మండిపడ్డారు.

‘‘ఫార్ములా ఈ కేసులో నేను ఎలాంటి తప్పు చేయలేదు. అవినీతి జరగలేదని నేను స్పష్టం చేశాను. నన్ను జైల్లో పెడితే విశ్రాంతి తీసుకుంటాను. ఇంకెన్ని కేసులు పెట్టినా భయపడేది లేదు. ఇది చట్టబద్ధంగా కాకుండా, రాజకీయంగా ప్రేరేపితమైన కక్షసాధింపు’’ అని అన్నారు.

అలాగే, కేసీఆర్, హరీశ్ రావులను కూడా విచారణకు పిలిచారని, ఇప్పుడు తనపై అరెస్ట్ ముచ్చట్లు చర్చించడమూ అదే క్రమంలో జరుగుతోందని వ్యాఖ్యానించారు. ‘‘తెలంగాణ ప్రజలు ఈ కుట్రలను అర్థం చేసుకుంటారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌ను చిత్తుచిత్తుగా ఓడిద్దాం. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను జాతికి అంకితం చేసి ఆరేళ్లు అవుతోంది. దాని గొప్పతనాన్ని ప్రజలకు తెలియజేయాలి’’ అంటూ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

Leave a Reply