ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేచింది. జనసేన పార్టీ భవిష్యత్తుపై కాంగ్రెస్ నేత తులసి రెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. పవన్ కళ్యాణ్ తన జనసేనను రద్దు చేసుకొని బీజేపీలో విలీనం చేయడం మంచిదని ఆయన పేర్కొన్నారు. తులసి రెడ్డి పవన్ రాజకీయాలపై ఘాటైన విమర్శలు చేస్తూ, పవన్కి ఏ సిద్ధాంతం ఉంది? చేగువేరా సిద్ధాంతమా? సనాతన ధర్మ సిద్ధాంతమా? లేక ఊసరవెల్లి సిద్ధాంతమా? అంటూ ప్రశ్నించారు. ఆయన విజయవాడలోని ఆంధ్ర రత్న భవన్లో మీడియాతో మాట్లాడారు.
తులసి రెడ్డి ప్రకారం, బీజేపీకి చంద్రబాబు, జగన్, పవన్ ముగ్గురూ కీలు బొమ్మలే అని కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచీ చెబుతూనే ఉందని గుర్తు చేశారు. నిన్నటి పిఠాపురం సభలో పవన్ ప్రసంగం అదే నిజం అని నిరూపించిందని వ్యాఖ్యానించారు. తనకు పదవి పిచ్చి లేదని చెప్పే పవన్ కళ్యాణ్, అసలు ఉప ముఖ్యమంత్రి పదవి ఎందుకు తీసుకున్నారని, నాగబాబుకు MLC పదవి ఎందుకు కట్టబెట్టారని తులసి రెడ్డి ప్రశ్నించారు. పవన్ తన ప్రసంగాల్లో టీడీపీని తానే నిలబెట్టానని చెప్పడం అర్థరహితమని, తాతకు మనుమడు దగ్గు నేర్పించినట్లుంది అంటూ వ్యంగ్యంగా విమర్శించారు.
నిన్నటి జనసేన సభ పూర్తిగా ఆత్మప్రశంస, పరనిందలతో నిండిపోయిందని, కానీ సూపర్ సిక్స్ హామీల ప్రస్తావనే లేదని తులసి రెడ్డి ఎద్దేవా చేశారు. జనసేన, బీజేపీ కూటమి రాష్ట్ర ప్రజలకు ఏమి చేయబోతోందో స్పష్టత లేకుండా పవన్ కళ్యాణ్ కేవలం రాజకీయ డ్రామాలే చేస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. మంత్రుల పనితీరుపై పవన్ కళ్యాణ్ కు ఇచ్చిన 10వ ర్యాంకు గమనార్హమని, కానీ గ్రామ పంచాయతీలు మురికి కూపాలుగా మారాయని, ప్రభుత్వ పనులు ఆలస్యమవుతున్నాయని తులసి రెడ్డి ఆరోపించారు. ఇప్పటికైనా పవన్ రాజకీయ డ్రామా మానుకుని తన శాఖపై దృష్టి పెట్టాలని సూచించారు.
తులసి రెడ్డి వ్యాఖ్యలతో జనసేన భవిష్యత్తుపై కొత్త చర్చ మొదలైంది. నిజంగానే పవన్ భాజపాలో విలీనం కావాలనుకుంటున్నారా? లేక ఇది కేవలం కాంగ్రెస్ నేతల విమర్శలా? అన్నది రాబోయే రాజకీయ పరిణామాలపై ఆధారపడి ఉంది. పవన్ కల్యాణ్ ఈ వ్యాఖ్యలకు ఎలా స్పందిస్తారో అనే ఉత్కంఠ ఇప్పుడు పెరిగింది.