తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ రాములమ్మ వార్తల్లోకి వచ్చారు. తన త్యాగాలను గుర్తుపెట్టుకొని ఎమ్మెల్యే కోటాలో తనకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని నేరుగా విజయశాంతి ఢిల్లీ కాంగ్రెస్ అధిష్టానం వద్దకే వెళ్లింది. ఈ సారి తనకు న్యాయం చేయాలని విజయశాంతి పట్టుబట్టడంతో, ఇప్పుడు ఈ విషయం కాంగ్రెస్ పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. విజయశాంతి సినీ రంగం నుండి రాజకీయ రంగంలోకి ప్రవేశించిన అనంతరం ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. ముందుగా తల్లి తెలంగాణ పార్టీ స్థాపించి తెలంగాణ వాదాన్ని బలంగా వినిపించారు. ఆ తర్వాత అనూహ్యంగా మారిన రాజకీయ పరిణామాలతో బిజెపి కండువా కప్పుకున్నారు. ఆ తర్వాత కొంత కాలానికి బీఆర్ఎస్ పార్టీలో విజయశాంతి జాయిన్ అయ్యారు. అనంతరం రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి వచ్చారు విజయశాంతి. ఆ తర్వాత మళ్లీ కాంగ్రెస్ నుండి బిజెపికి లో చేరారు. గత ఎన్నికల ముందు విజయశాంతి బిజెపి నుండి కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఎన్నికల సమయంలో తన వంతుగా ప్రచారాన్ని సైతం సాగించారు. ఇటీవల తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన క్రమంలో బీఆర్ఎస్ పార్టీ నుండి పలు విమర్శలు వచ్చాయి. ఆ సమయంలో విజయశాంతి గతంలో తాను ఏర్పాటుచేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎక్స్ ఖాతా ద్వారా పోస్ట్ చేసి, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహానికి మద్దతు తెలిపారు. అలాగే ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డులపై సీఎం రేవంత్ రెడ్డి మాటకు విజయశాంతి వత్తాసు పలికారు. తెలంగాణకు కనీసం నాలుగు అవార్డులైన ఇచ్చి ఉండాల్సిందని విజయశాంతి అభిప్రాయపడ్డారు.
ఇక తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలో 5 ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ 5 స్థానాలకు ఆశావాహుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ప్రణాళిక ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో పడ్డాయి. బీఆర్ఎస్ కు ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యకు ఒక ఎమ్మెల్సీ ఖాయమనే చెప్పవచ్చు. మిగిలిన 4 స్థానాలకు కాంగ్రెస్ నుండి అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. ఇక్కడే విజయశాంతి ఎమ్మెల్సీ సీటు కోసం నేరుగా ఢిల్లీ వెళ్లి ఏఐసీసీ పెద్దలతో మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేను కలిసిన విజయశాంతి, ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ సీటు కేటాయించాలని ఢిల్లీ పెద్దలను కోరగా వారు సుముఖంగా వున్నట్టు తెలుస్తోంది.