భారత రాజకీయాల్లో పెను మార్పులకు దారి తీసే అంశం.. డీలిమిటేషన్. 2026 నాటికి జనాభా ప్రాతిపదికన లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనను కేంద్ర ప్రభుత్వం చేపట్టాలని నిర్ణయించడంతో దక్షిణాది రాష్ట్రాల్లో ఆందోళన నెలకొంది. ఉత్తరాది రాష్ట్రాలతో పోల్చితే దక్షిణాదిలో జనాభా పెరుగుదల తక్కువగా ఉండటంతో, కొత్తగా నియోజకవర్గాలు రావాల్సిన అవకాశాలు తగ్గిపోతున్నాయి. ఇది దక్షిణాది రాష్ట్రాలకు రాజకీయంగా భారీ నష్టమవుతుందనే అభిప్రాయంతో తమిళనాడు సీఎం స్టాలిన్ ఈ వివాదాస్పద అంశంపై దక్షిణాది నేతలతో భేటీ ఏర్పాటు చేశారు.
చెన్నైలో జరిగిన ఈ కీలక సమావేశానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. ఒకే వేదికపై ఇద్దరు ప్రత్యర్థి నేతలు కనిపించడంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ ప్రారంభమైంది. బీజేపీ విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న రెండు పార్టీలు.. కాంగ్రెస్, బీఆర్ఎస్.. డీలిమిటేషన్ అంశంలో ఒకే వాదనను పట్టుకుని ముందుకెళ్లడం గమనార్హం.
ఈ భేటీకి కేరళ సీఎం పినరయి విజయన్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, బిజు జనతాదళ్ నేతలు హాజరయ్యారు. కర్ణాటక ప్రభుత్వం తరఫున ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ హాజరవగా, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాత్రం తన తరఫున లేఖ రాశారు. ఆసక్తికరంగా, తృణమూల్ కాంగ్రెస్ ఈ సమావేశానికి దూరంగా ఉండడం గమనార్హం.
ఆంధ్రప్రదేశ్ నుంచి ఏ ప్రధాన పార్టీ కూడా ఈ భేటీలో పాల్గొనలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తటస్థ వైఖరిని కొనసాగించగా, తెలుగుదేశం, జనసేన పార్టీలు కేంద్రం లో ఎన్డీయే తో పొత్తు ఉండటం వల్ల వారి నుండి ఎటువంటి స్పందన లేదు.
కేంద్ర ప్రభుత్వం తీసుకురాబోయే డీలిమిటేషన్ ప్రక్రియపై దక్షిణాది నేతలు గళమెత్తడం, రేవంత్ రెడ్డి, కేటీఆర్ వంటి రాజకీయ ప్రత్యర్థులు ఒకే వేదికను పంచుకోవడం తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలకు దారితీయొచ్చు. దీని ప్రభావం భవిష్యత్ ఎన్నికలపై ఎలా పడుతుందనేది వేచిచూడాలి.
CM Revanth Reddy Attends DMK-Led Meet on Delimitation in Chennai
చెన్నైలో డీఎంకే ఆధ్వర్యంలో జరుగుతున్న డీలిమిటేషన్ సమావేశానికి హాజరైన సీఎం రేవంత్ రెడ్డి#RevanthReddy
• @revanth_anumula pic.twitter.com/ecppL1Eamc— Congress for Telangana (@Congress4TS) March 22, 2025