బనకచర్ల ప్రాజెక్ట్‌పై ముదురుతున్న వివాదం.. మళ్లీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సిద్ధం!

తెలంగాణలో బనకచర్ల ప్రాజెక్ట్ చుట్టూ రాజకీయ ఉత్కంఠ పెరిగిపోతోంది. ఈ ప్రాజెక్ట్‌పై కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం మళ్లీ ముదురుతోంది. ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటూ కొత్త అంశాలను తెరపైకి తీసుకొస్తున్నారు. తాజాగా, బీఆర్ఎస్‌ను టార్గెట్ చేస్తూ మరోసారి పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌కు రెడీ అవుతోంది కాంగ్రెస్ ప్రభుత్వం.

ఈ వివాదంపై కాంగ్రెస్, బీఆర్ఎస్‌లు పునరావృతంగా వాడి వేడి ఆరోపణలు చేసుకుంటుండగా, రేవంత్ సర్కార్ వైఫల్యం వల్లే ఏపీ ప్రభుత్వం దూకుడుగా ముందుకు సాగుతోందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. తమ ఒత్తిడి వల్లే ఈ అంశం బయటికి వచ్చిందని బీఆర్ఎస్ నేతలు చెబుతుండగా, కాంగ్రెస్ నాయకులు మాత్రం ఇది బీఆర్ఎస్ వైఫల్యాన్ని సాకుగా చూపే ప్రయత్నం అంటున్నారు.

తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఏపీతో చర్చలకు సిద్ధమని సంకేతాలు ఇచ్చిన నేపథ్యంలో, బీఆర్ఎస్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. చర్చల పేరుతో అసలు సమస్యను దాచే ప్రయత్నమని, ముందుగా అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని కేంద్రాన్ని కోరాలని డిమాండ్ చేస్తోంది.

కాంగ్రెస్ వ్యూహం vs బీఆర్ఎస్ ఆరోపణలు

బీఆర్ఎస్‌ను కోణంలోనూ ఇరుకున పెట్టేందుకు కాంగ్రెస్ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుపై అసెంబ్లీలో చర్చకు సిద్ధమా కేసీఆర్..? అంటూ సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. గోదావరిలోకి ప్రతి సంవత్సరం మూడు వేల టీఎంసీలు పోతున్నాయని చెప్పింది.. కేసీఆర్ కాదా అని కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయలేదని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతోంది.

ఉత్తమ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్.. బీఆర్ఎస్‌పై ఆరోపణలు

ఇక మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తాజా ప్రకటనలతో బనకచర్ల వివాదం మరోసారి హాట్ టాపిక్ అయింది. కేంద్ర జలశక్తి మంత్రికి బనకచర్ల ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన విషయాన్ని ఆయన వెల్లడించారు. త్వరలోనే అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరుగుతుందని కేంద్రం హామీ ఇచ్చినట్లు చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో ప్రాజెక్టు డిజైన్ ప్రగతిభవన్‌ వేదికగా రూపొందించిందని తెలిపారు. ఈ నెల 30న బనకచర్లపై అధికారిక ప్రజెంటేషన్ ఉంటుందని చెప్పారు.

రాజకీయ ఎత్తులు కొనసాగేలా కనిపిస్తున్న బనకచర్ల వివాదం

ఈ స్థితిలో బనకచర్ల ప్రాజెక్ట్ చుట్టూ బీఆర్ఎస్, కాంగ్రెస్‌లు పెట్టే రాజకీయ ఎత్తుపల్లాలు, విమర్శలు, వ్యూహాలు రాబోయే రోజుల్లో మరింత వేడెక్కే అవకాశముంది. ఇది కేవలం నీటి ప్రాజెక్ట్ విషయంలోనో, అభివృద్ధి అంశంలోనో మాత్రమే కాదు.. రాజకీయంగా కూడా కీలకంగా మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Leave a Reply