ఇండియా, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడికి భారత సైన్యం కఠినమైన ప్రతిస్పందన ఇచ్చింది. ఆపరేషన్ సింధూర్ పేరిట పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం తీవ్ర దాడులు చేసింది. ఈ ఆపరేషన్లో పలువురు ఉగ్రవాదులు హతమయ్యారని సమాచారం. మరోవైపు పాకిస్తాన్ సైన్యం నియంత్రణ రేఖ వద్ద భారత్ సామాన్యులపై కాల్పులకు తెగబడింది. భారత్ సైన్యం పాక్ దాడులకు తగిన ప్రతిదాడులు జరుపుతోంది.
భారత సైన్యం చూపిన ధైర్యానికి దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. సినీ మరియు రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు ఈ విజయాన్ని అభినందిస్తున్నారు.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ విజయశాంతి తన ట్వీట్లో స్పందిస్తూ, పాకిస్తాన్కు ధీటుగా నిలబడి ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం చరిత్రలో కీలక పాత్ర పోషించిందని పేర్కొన్నారు.
ఆమె ట్వీట్ ప్రకారం:
“1965లో పాక్తో యుద్ధంలో భారత సైన్యం నడిబొడ్డువరకు చొచ్చుకెళ్లింది. 1971లో తూర్పు పాకిస్తాన్ను విడదీసి బంగ్లాదేశ్ ఏర్పాటులో కూడా కాంగ్రెస్ కీలక పాత్ర పోషించింది. ఈ చరిత్ర నేటికీ భారత ప్రభుత్వాలకు మార్గదర్శకంగా నిలుస్తోంది. రాజకీయ ప్రయోజనం కోసం ఈ అంశాన్ని వాడకూడదని, ప్రజలు దీనిని దేశ భద్రత కోణంలోనే చూడాలని ఆశిస్తున్నాను. హర హర మహాదేవ్… జై హింద్… జై జవాన్!”
అయితే దేశ భద్రతకు సంబంధించి సున్నితమైన సమయంలో ఆమె చేసిన ఈ వ్యాఖ్యలపై విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. కొంతమంది నెటిజన్లు “ఇప్పుడు ఇటువంటి ట్వీట్లు అవసరమా?” అని ప్రశ్నించగా, మరికొందరు ఆ ట్వీట్ను తొలగించాలంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.