అధికారాన్ని కోల్పోయిన తర్వాత వరుస ఎదురుదెబ్బలు తింటున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో పెద్ద దెబ్బ తగిలింది. ఆంధ్రప్రదేశ్ శాసనమండలి డిప్యూటీ ఛైర్పర్సన్గా ఉన్న జకియా ఖానం వైసీపీకి రాజీనామా చేశారు. అంతేకాక, తన ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించారు.
జకియా ఖానం తన రాజీనామా లేఖను వ్యక్తిగత సిబ్బంది ద్వారా మండలి ఛైర్మన్కు పంపించారు. ఇప్పటికే కొన్ని సంవత్సరాలుగా వైసీపీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న ఆమె, ఆ పార్టీపై అసంతృప్తితో ఉన్నట్లు పలుమార్లు సంకేతాలు ఇచ్చారు. ఇప్పుడు ఆమె రాజీనామాను ఆమోదిస్తే, ఎమ్మెల్సీ స్థానంతో పాటు డిప్యూటీ ఛైర్మన్ పదవి కూడా ఖాళీ కానుంది.
గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా, ఇప్పుడు బీజేపీలోకి
అన్నమయ్య జిల్లా రాయచోటికి చెందిన జకియా ఖానంను 2020 జూలైలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ చేశారు. గడచిన రెండేళ్లుగా ఆమె రాజకీయంగా వైసీపీకి దూరంగా ఉంటున్నారు. ఇటీవల రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి నారా లోకేష్ను కలిసి, కుటుంబ సభ్యులతో కలిసి శాలువా కప్పి సత్కరించారు. అప్పుడే ఆమె టీడీపీలో చేరబోతున్నారన్న ప్రచారం ఊపందుకుంది. కానీ ఆందరికీ షాక్ ఇస్తూ ఆమె బీజేపీలో చేరడం రాజకీయ వర్గాల్లో చర్చనీయంశమైంది.
బీజేపీ కండువా కప్పుకున్న జకియా ఖానం
ఈ రోజు ఉదయం వైసీపీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన అనంతరం జకియా ఖానం బీజేపీ కండువా కప్పుకున్నారు. ఆమె చేరికకు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి స్వయంగా ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎమ్మెల్యే పార్థ సారధి కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జకియా ఖానం మాట్లాడుతూ.. “ప్రధాని నరేంద్ర మోడీ కుల, మత భేదాలు లేకుండా దేశ ప్రజలందరినీ తన బిడ్డలుగా భావించారు. వక్ఫ్ బోర్డు వంటి సంపదలో ముస్లిం పేదలు కూడా భాగస్వాములు కావాలని ఆయన ఆలోచించారు. నేను బీజేపీలోకి వచ్చి ముస్లింలకు ఒక మంచి సంకేతం ఇవ్వాలనుకున్నాను. నన్ను చూసి మరింత ముస్లిం మైనారిటీలు బీజేపీలో చేరాలని ఆశిస్తున్నాను” అని వ్యాఖ్యానించారు.