ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరింత రసవత్తరంగా మారుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీపై వరుస దాడులు కొనసాగిస్తుండగా, ఇదే సమయంలో జగన్ పార్టీని పునర్వ్యవస్థీకరించేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతుందన్న అభిప్రాయంతో, జిల్లాల్లో పర్యటనలు ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు.
మాజీ సీఎం జగన్ తాజాగా పార్టీలో కీలక నియామకాలు చేపట్టారు. ముఖ్యంగా యువతలో మంచి పట్టు ఉన్న బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని వైసీపీ యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించారు. కర్నూలు జిల్లాకు చెందిన బైరెడ్డి, గతంలో వైసీపీ హయాంలో శాప్ ఛైర్మన్గా పని చేశారు. ఇప్పుడాయనపై జగన్ పెద్ద బాధ్యతను అప్పగించారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, వైసీపీ హయాంలో జరిగిన కార్యక్రమాలను అవినీతిగా చూపించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, దీనిపై బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఘాటుగా స్పందించారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో, జిల్లాల్లో పర్యటిస్తూ కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడం, జగన్ నాయకత్వాన్ని ప్రజలకు వివరిస్తూ పార్టీని బలోపేతం చేయడం ఆయనకు అప్పగించిన ప్రధాన బాధ్యత.
నా పై నమ్మకంతో నాకు మరో భాధ్యత ఇచ్చిన @YSRCParty🇸🇱 పార్టీకి @ysjagan అన్నకి ప్రత్యేక ధన్యవాదములు🙏🙏 https://t.co/67X4eu9chK
— Byreddy Siddhartha Reddy (@BsrLeader) March 26, 2025
2024 ఎన్నికల సమయంలో యువతకు ఉద్యోగ, ఉపాధి హామీలు ఇచ్చిన కూటమి, ఇప్పటివరకు వాటిని అమలు చేయలేదని వైసీపీ ఆరోపిస్తోంది. దీనిపై స్పందిస్తూ, పార్టీ తరఫున యువతను చైతన్యవంతం చేయడం, ప్రభుత్వాన్ని నిలదీయడం కోసం బైరెడ్డికి బాధ్యత అప్పగించారు.
జగన్ పార్టీ పునర్వ్యవస్థీకరణలో భాగంగా మరికొన్ని ముఖ్యమైన నియామకాలు చేశారు.. కాకుమాను రాజశేఖర్ను రాష్ట్ర ప్రచార విభాగం అధ్యక్షుడిగా నియమించారు. శెట్టిపల్లి రఘు రామిరెడ్డిని పార్టీ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్గా నియమించారు. క్రమశిక్షణ కమిటీ సభ్యులుగా రెడ్డి శాంతి, తానేటి వనిత, కైలే అనిల్, వై. విశ్వేశ్వరరెడ్డిలను నియమించారు.
జగన్ వచ్చే నెల నుంచి అన్ని జిల్లాల్లో విస్తృత పర్యటనలు చేయనున్నారు. ఈ పర్యటనలకు ముందు జిల్లా స్థాయిలో పార్టీ కమిటీలను పూర్తిగా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. క్షేత్ర స్థాయిలో పనిచేసే నేతలకు ప్రాధాన్యత ఇస్తూ, రాష్ట్రస్థాయిలో కొన్ని పదవుల్లో మార్పులు చేయనున్నారు.
ఈ క్రమంలో, వచ్చే వారం రోజుల్లో మరిన్ని కీలక నియామకాలు ప్రకటించేందుకు జగన్ సిద్ధమవుతున్నారు. తాజా నిర్ణయాలతో వైసీపీ భవిష్యత్తు కార్యాచరణ ఏమిటో ఆసక్తిగా మారింది.