రాష్ట్రంలో మరో ప్రత్యేక విద్యా మార్గం ప్రారంభమైంది. పోలీసు శాఖకు చెందిన కుటుంబాల పిల్లల కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ (YIPS) మంచిరేవులలో ఈరోజు ప్రారంభమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఈ స్కూల్ ప్రారంభోత్సవంలో పాల్గొని శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రులు శ్రీధర్ బాబు, పోలీసు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం సీఎం స్కూల్ క్యాంపస్ను పరిశీలించారు.
సీట్ల కేటాయింపు ఎలా ఉంది?
ఈ స్కూల్లో మొత్తం 200 సీట్లు ఉంటాయి. ప్రతి తరగతిలో 40 సీట్లు ఉండగా, 1 నుంచి 5వ తరగతుల వరకూ అడ్మిషన్లు ఉంటాయి.
50% సీట్లు అమరులైన మరియు ప్రస్తుత విధుల్లో ఉన్న పోలీసు సిబ్బంది పిల్లలకు
మిగతా 50% సీట్లు స్థానిక ఆమోదిత కుటుంబాలకు
మొత్తం 100 సీట్లు పోలీసు కుటుంబాల కోసం ప్రత్యేకంగా కేటాయింపు
ఫీజులు, విద్యా ప్రమాణాలు
ఈ పాఠశాల CBSE సిలబస్, అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం విద్య అందించనుంది.
ఫీజులు రిజనబుల్గా ఉంటాయని అధికారులు తెలిపారు. విద్యతో పాటు క్రీడలు, శారీరక శిక్షణ, నైతిక విలువలు, నాయకత్వ లక్షణాలపై దృష్టి పెడతారు.
ఎలా అప్లై చేయాలి?
అధికారిక వెబ్సైట్ yipschool.in ను ఓపెన్ చేయాలి
మెనూలో ‘Admissions’ విభాగాన్ని క్లిక్ చేయాలి
విద్యార్థి పేరు, తల్లిదండ్రుల పేరు, తరగతి ఎంచుకోవాలి
మీ కుటుంబం పోలీస్/నాన్ పోలీస్గా ఎంపిక చేసుకోవాలి
చిరునామా, ఫోన్ నంబర్, ఈమెయిల్ ఐడీ నమోదు చేయాలి
చివరగా Submit బటన్ను క్లిక్ చేయాలి
ఇది ఎందుకు ప్రత్యేకం?
పోలీసు శాఖలో పనిచేస్తున్నవారి పిల్లలకు నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంది. ఇది సైనిక పాఠశాలల తరహాలోనే ఉండే మోడల్ స్కూల్గా అభివృద్ధి చేస్తున్నారు.