Duvvada Srinivas: డాక్టరేట్ సత్కారంతో దువ్వాడ.. అమెరికా నుంచి ప్రత్యేక గుర్తింపు!

ఆంధ్రప్రదేశ్ వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కు ప్రతిష్టాత్మక డాక్టరేట్ బిరుదు లభించింది. హైదరాబాద్‌లోని గ్రీన్ పార్క్ హోటల్‌లో జరిగిన వేడుకలో, అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సలహాదారుడిగా పనిచేసిన మార్క్ బర్న్ చేతుల మీదుగా శ్రీనివాస్ ఈ గౌరవాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన రాజకీయ ప్రస్థానం, సామాజిక సేవలపై ప్రశంసలు లభించాయి.

దువ్వాడ శ్రీనివాస్ ప్రజాసేవలో చూపిన అంకితభావం, సమాజం కోసం చేసిన విశేషమైన కృషిని గుర్తిస్తూ డే స్ప్రింగ్ అంతర్జాతీయ విశ్వవిద్యాలయం ఈ గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. రాజకీయ రంగంలో ప్రజల కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ఆయన సేవలను గుర్తించాల్సిన అవసరం ఉందని విశ్వవిద్యాలయ ప్రతినిధులు తెలిపారు.

ఈ ఘనతను సాధించిన అనంతరం దువ్వాడ శ్రీనివాస్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. సమాజ సేవలో ఆయన కృషి, ప్రజల ప్రయోజనాల కోసం తీసుకున్న నిర్ణయాలు ఈ గౌరవానికి కారణమని రాజకీయ, సామాజిక వర్గాల ప్రముఖులు పేర్కొన్నారు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఈ ప్రత్యేక కార్యక్రమానికి ఇండో-ఇజ్రయెల్ ఫ్రెండ్‌షిప్ అసోసియేషన్ (IIFA) జాతీయ చైర్మన్ డా. ఆడమ్ రాజ్ డెక్కపాటి, రెవరెండ్ సొల్మన్ గట్టు, మణిపూర్ బిషప్ పోతన్, మాజీ ఎంపీ హర్షకుమార్, మున్సిపల్ చైర్మన్ సరస్వతి, దివ్వెల మాధురి, అలాగే కాంగ్రెస్ సీనియర్ నాయకులు అశోక్ గౌడ్, రాజయ్య గౌడ్, పల్లె వెంకట్ గౌడ్, శంకర్ గౌడ్ తదితరులు హాజరై శ్రీనివాస్‌ను అభినందించారు.

ఈ పురస్కారంపై స్పందించిన దువ్వాడ శ్రీనివాస్, “ఈ గౌరవం నాపై మరింత బాధ్యతను గుర్తు చేస్తోంది. ప్రజల కోసం, సమాజం కోసం ఇంకా ఎక్కువ సేవ చేయాలని ఇది నన్ను ప్రేరేపిస్తోంది” అని పేర్కొన్నారు.

Leave a Reply