AP: కుప్పంలో అమానుష ఘటన.. మహిళను చెట్టుకు కట్టేసిన ఘటనపై చంద్రబాబు సీరియస్

ఆంధ్రప్రదేశ్‌లో ఓ అమానవీయ ఘటన కలకలం రేపుతోంది. తీసుకున్న అప్పు చెల్లించలేదని ఓ మహిళను చెట్టుకు కట్టేసి హింసించిన ఘటన చిత్తూరు జిల్లా కుప్పంలో చోటు చేసుకుంది. ఇది ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడం గమనార్హం.

నారాయణపురం గ్రామానికి చెందిన తిమ్మరాయప్ప అనే వ్యక్తి తన గ్రామస్తుడైన మునికన్నప్ప వద్ద రూ.80 వేలు అప్పు తీసుకున్నాడు. అప్పు తిరిగివ్వకపోవడంతో భార్యతో సహా గ్రామం వదిలి వెళ్లిపోయాడు. దీంతో అతని భార్య శిరీష తన పుట్టింటి ప్రాంతమైన కెంచనబల్లలో కూలిపనులు చేస్తూ కుమారుడిని పోషిస్తోంది.

ఈ క్రమంలో శిరీష తన కుమారుడి టీసీ కోసం నారాయణపురం పాఠశాలకు వచ్చింది. విషయం తెలిసిన మునికన్నప్ప కుటుంబం ఆమెను అడ్డగించి, అప్పు విషయంలో ఒత్తిడి తెచ్చింది. తాను డబ్బులు ఇవ్వలేనని చెప్పడంతో ఆమెను చెట్టుకు కట్టేసి అమానవీయంగా హింసించారు. శిరీష కుమారుడు కన్నీళ్లు పెట్టుకున్నా వారి మనసు కరగలేదు.

విషయం తెలిసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్పందించిన పోలీసులు శిరీషను రక్షించి, బాధితురాలి ఫిర్యాదు మేరకు మునికన్నప్ప, అతని భార్య మునెమ్మ, కుమారుడు రాజా, కోడలు జగదీశ్వరి‌పై ఐపీసీ సెక్షన్లు 341, 323, 324, 506, 34 ప్రకారం కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

చంద్రబాబు తీవ్ర ఆగ్రహం

ఈ ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. మహిళను చెట్టుకు కట్టేసి దాడిచేసిన మునికన్నప్ప కుటుంబంపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీకి ఆదేశించారు. ‘‘ఇటువంటి అమానుష చర్యలు మళ్లీ జరగకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలి. బాధిత కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుంది’’ అని సీఎం స్పష్టమైన సందేశం ఇచ్చారు.

Leave a Reply