విశాఖలో గర్భిణి హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. అనూష అనే నిండు గర్భిణి దారుణ హత్యకు గురవడం, ఆమె భర్త జ్ఞానేశ్వర్నే నిందితుడిగా బయటపడటం సెన్సేషన్గా మారింది. పెళ్లై రెండేళ్లవుతున్న అనూషకు భర్త నరకాన్ని చూపించాడు. తాజాగా వెలుగు చూసిన విషయాలు పక్కా ప్లాన్తో ఆమెను హతమార్చాడని స్పష్టంగా చెబుతున్నాయి.
అనూషను వదిలించుకోవాలని జ్ఞానేశ్వర్ ఎన్నో కుట్రలు పన్నాడు. ఓసారి ఫలూదాలో నిద్రమాత్రలు కలిపి ఆమెను మత్తు మందులతో చంపే ప్రయత్నం చేశాడు. కానీ ఆ పథకం విఫలమైంది. చివరకు నిద్రలో ఉన్న ఆమెను గొంతు నులిమి హత్య చేశాడు. అంతే కాకుండా గర్భంలో ఉన్న ఆడ శిశువూ ఈ ఘాతుకానికి బలైంది. కేజీహెచ్లో నిర్వహించిన పోస్ట్మార్టమ్లో ఈ విషయం వెల్లడైంది.
ఇదంతా చేసిన తర్వాత నాటకం మొదలుపెట్టిన జ్ఞానేశ్వర్ స్థానికులతో కలిసి ఆస్పత్రికి వెళ్లాడు. కానీ పోలీసులకు అనుమానం రావడంతో అసలు కథ బయటపడింది. విచారణలో తనే హత్య చేశానని ఒప్పుకున్నాడు.
అనూష కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతూ.. ఇలాంటి దారుణానికి పాల్పడిన అతనికి ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం నిందితుడు జ్ఞానేశ్వర్ను 14 రోజుల రిమాండ్కు పంపారు.
2022లో ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట ఇది. మధురవాడలో కలసి జీవనం ప్రారంభించారు. కానీ రెండు ఫాస్ట్ఫుడ్ సెంటర్లు నడుపుతూ ఉన్న జ్ఞానేశ్వర్ తన భార్యకు వాళ్ళ కుటుంబం పరిచయం చేయకపోవడం.. అత్త, మామల గురించి అడిగినా తెలివిగా తప్పించుకోవటం జరిగేది. ఎప్పటికైనా తాను ఆమెను వదిలించుకోవాలనే ఆలోచనతో ఉంటూ చివరకు హత్యకు పాల్పడ్డాడు. ఓసారి తనకు క్యాన్సర్ ఉందని చెప్పి విడిపోవాలని సూచించాడట. కానీ అనూష మాత్రం “నీతోనే జీవితాంతం ఉంటా” అని తేల్చి చెప్పింది. ఇదే అతని లోపల కోపాన్ని రెచ్చగొట్టిందని పోలీసులు భావిస్తున్నారు.
ఇప్పుడు ఈ కేసు పట్ల ప్రజలలో తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. మహిళల భద్రత గురించి మరోసారి ప్రశ్నలు తలెత్తిస్తున్న ఈ సంఘటనపై తీవ్ర చర్చ జరుగుతోంది.