ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎక్కడికి వెళ్లినా వెంకటేశ్వర స్వామి ఫొటోలు, ప్రసాదాన్ని వెంట తీసుకెళ్తుంటారు. పెట్టుబడుల కోసం విదేశాలకు వెళ్లినా, ఢిల్లీ పెద్దలతో సమావేశాలైనా.. తోడుగా శ్రీవారి ప్రతిమలు, ప్రసాదాలు ఉండాల్సిందే! ఎందుకంటే, శ్రీవారి ఆశీస్సులతో ఏ పని తలపెట్టినా సక్సెస్ అవుతుందని సీఎం చంద్రబాబు బలంగా నమ్ముతుంటారు. ఇదే చంద్రబాబు సెంటిమెంట్. ఎప్పటి నుంచో ఈ సెంటిమెంట్ చంద్రబాబుకు ఉంది.
ఇప్పుడు ఈ సెంటిమెంట్ మరోసారి రిపీట్ అయింది. నవ్యాంధ్రకు రెండవసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏపీ రాజధాని అమరావతిపై చంద్రబాబు మళ్లీ స్పెషల్ ఫోకస్ పెట్టారు. అధికారంలోకి రాగానే అమరావతి రూపు రేఖలు మార్చేందుకు శ్రీకారం చుట్టారు. దానిలో భాగంగా, అమరావతిలోని ముళ్ల కంపలు, చెట్లు, చెదారాన్ని తొలగించే పనులకు ఆదేశాలు ఇచ్చారు. ఆయా పనులు పూర్తవడంతో, అమరావతి మళ్లీ ఊపిరి పోసుకుంటోంది. అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోంది.
నవ్యాంధ్ర ఏర్పాటు తర్వాత ఫస్ట్ టర్మ్ సీఎం అయిన సమయంలో రాజధాని ఏర్పాటుకు శ్రమించిన చంద్రబాబు, ఇప్పుడు మరోసారి పునరుజ్జీవం పోస్తున్నారు. ఈ క్రమంలోనే, అమరావతిలో పనుల పునఃప్రారంభానికి సిద్ధమవుతున్నారు.
అయితే, ఆయా కార్యక్రమాలకు ముందే కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి సెంటిమెంట్ను ఫాలో అవుతున్నారు. అమరావతిలో శ్రీవారికి ప్రత్యేక పూజలు నిర్వహించబోతున్నారు. రేపు టీటీడీ ఆధ్వర్యంలో రాజధాని వేదికగా శ్రీనివాస కల్యాణం జరగబోతోంది. ఈ కార్యక్రమానికి ఏపీ ప్రభుత్వం పెద్దయెత్తున ఏర్పాట్లు చేస్తోంది. రాజధానిలోని ప్రతి ఇంటికి ఆహ్వాన పత్రిక అందించడంతోపాటు, అమరావతి రైతులందరూ శ్రీవారి కల్యాణ మహోత్సవానికి హాజరుకావాలని టీటీడీ ఆధ్వర్యంలో ఆహ్వానించారు.
శ్రీనివాసుని కల్యాణం తర్వాత ఏప్రిల్లో అమరావతి పనుల పునఃప్రారంభం జరగనుందని ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. వాస్తవానికి, ఏ పని చేసినా శ్రీవారి నామస్మరణ తర్వాతే అని గతంలోనే చంద్రబాబు పలుమార్లు చెప్పారు. దానిలో భాగంగానే, గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచాక ముందుగా తిరుమల శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆ తర్వాత పాలనా పరమైన ప్రక్షాళన కూడా తిరుమల నుంచే ప్రారంభించారు.
ఇప్పుడు కూడా అమరావతిలో పనుల పునఃప్రారంభానికి శ్రీవారి సెంటిమెంట్ను అనుసరిస్తున్నారు. అమరావతిలో శ్రీవారి కల్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీవారి కల్యాణోత్సవం తర్వాత ఏప్రిల్ రెండో వారంలో అమరావతికి ప్రధాని మోదీ రాబోతున్నారు. రాజధాని అభివృద్ధి పనులను తిరిగి ప్రారంభించనున్నారు.
మొత్తం మీద, అమరావతిని రాజధాని నగరంగా తీర్చిదిద్దటానికి చంద్రబాబు అన్ని విధాలుగా ప్రణాళికలు రూపొందించారు. త్వరితగతిన అమరావతి నిర్మాణం పూర్తి చేయాలని ప్రజలు కూడా తమతమ సహకారాన్ని ప్రభుత్వానికి అందిస్తున్నారు.
శ్రీవారి నామస్మరణ తర్వాత ఏ పని చేసినా సక్సెస్ అవుతుందని భావించే చంద్రబాబు, ఇప్పుడు మరోసారి వెంకన్న సెంటిమెంట్ను ఫాలో అవుతున్నారు. రాజధాని వేదికగా శ్రీనివాస కల్యాణం జరిపించి, ఇక రాజధాని నిర్మాణ పనులను వేగవంతం చేయనున్నట్లు స్పష్టమవుతోంది.