Vangaveeti Radha: వంగవీటి రాధాకు బంఫర్ ఆఫర్: చంద్రబాబు కీలక పదవి ఇచ్చే అవకాశం..!

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు తన తాజా రాజకీయ వ్యూహంలో కాపు సామాజిక వర్గానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా స్పష్టమవుతోంది. ఇప్పటికే బీజేపీ నేత సోము వీర్రాజు, నటుడు నాగబాబులను ఎమ్మెల్సీలుగా నియమించిన కూటమి ప్రభుత్వం, ఇప్పుడు మరో కీలకమైన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

తాజాగా ప్రముఖ కాపు నేత, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా అపాయింట్‌మెంట్ ఇచ్చి భేటీ అయ్యారు. ఈ సమావేశం దాదాపు 20 నిమిషాల పాటు సాగిందని సమాచారం. ఈ సందర్భంగా రాధాకు త్వరలోనే ఒక కీలక పదవి ఇవ్వనున్నట్టు చంద్రబాబు హామీ ఇచ్చినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఈ రోజు వంగవీటి రాధాతో పాటు ఎమ్మెల్సీగా ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన కొణిదెల నాగబాబు కూడా సీఎం చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. గతంలోనే చంద్రబాబు నాగబాబును క్యాబినెట్‌లోకి తీసుకుంటామని ప్రకటించారు. ఇప్పుడు వంగవీటి రాధాకి కూడా అదే రీతిలో కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని అంటున్నారు.

కాపు సామాజిక వర్గంలో తన ప్రాధాన్యతను మరింత బలోపేతం చేసుకోవాలన్న చంద్రబాబు వ్యూహంలో భాగంగా ఇలా వరుసగా కీలక పదవులు కాపు నేతలకు ఇవ్వడం కొనసాగుతోంది. రాధాతో సమావేశం అనంతరం ఆయన తన సన్నిహితులతో మాట్లాడుతూ – చర్చ సానుకూలంగా జరిగిందని, త్వరలో మంచి వార్త వచ్చే అవకాశం ఉందని తెలిపారు.

ఈ తాజా పరిణామాల నేపథ్యంలో కాపు వర్గంలో ఉత్సాహం పెరిగిందని, చంద్రబాబు నిర్ణయాలు ఈ ఎన్నికల ముందు కీలక ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Leave a Reply