వైఎస్సార్సీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే పలు రకాల కేసులలో రిమాండ్లో ఉన్న వంశీపై తాజాగా మరో కేసు గన్నవరం పోలీసులు నమోదు చేశారు. నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ జరిగిందంటూ మైనింగ్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా గన్నవరం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
ఈ కొత్త కేసులో ప్రాథమిక విచారణ అనంతరం క్రైమ్ నెంబర్ 142/2025గా నమోదు చేసినట్లు సమాచారం. వంశీ ప్రస్తుతం జైలులో ఉన్నందున, ఈ కేసులో సంబంధించి త్వరలోనే కోర్టులో పీటీ వారెంట్ దాఖలు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.
గతంలో మైనింగ్ అక్రమాలపై గనుల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ మొత్తం 58 పేజీల ఫిర్యాదు సమర్పించగా, దానిపై ఆధారంగా ఈ చర్యలు తీసుకున్నారు. తాజా కేసుతో వంశీ త్వరలో విడుదలయ్యే అవకాశం ఇక లేదనే తెలుస్తోంది. దీంతో ఆయన కుటుంబ సభ్యులు, వైసీపీ శ్రేణుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.
ఈ నెల 13న బెయిల్.. కానీ మళ్లీ కేసు
ఈ నెల 13న సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీకి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కానీ ఇదే సమయంలో ఆయనపై గన్నవరం టీడీపీ కార్యాలయం దాడి, ల్యాండ్ కబ్జా, మైనింగ్ అక్రమాలు వంటి పలు కేసులు కొనసాగుతున్నాయి. టీడీపీ ఆఫీసు దాడి కేసులో వంశీకి A71 నిందితుడిగా రిమాండ్ విధించగా, కోర్టు ఈ నెల 21 వరకు రిమాండ్ను పొడిగించింది.
ఇప్పటికే ఉన్న కేసులకు తోడు, తాజా కేసు కూడా రావడంతో వంశీకి త్వరలో బెయిల్ వచ్చే అవకాశాలు కష్టమేనని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.