Manchu Vishnu: మంచి మనసు చాటుకున్న మంచు విష్ణు.. ఉగ్రదాడి బాధిత కుటుంబాన్ని దత్తత..!

సినీ నటుడు, మా అధ్యక్షుడు మంచు విష్ణు మరోసారి తన హృదయపూర్వక కృతజ్ఞతను చాటుకున్నారు. తిరుపతిలో ఇప్పటికే 120 మంది అనాథ పిల్లలను దత్తత తీసుకుని, వారికి అవసరమైన విద్య, వసతి, నిత్యావసరాల్ని అందిస్తున్న విష్ణు… ఇప్పుడు కశ్మీర్ ఉగ్రదాడిలో మృతిచెందిన నెల్లూరు జిల్లా వాసి మధుసూదన్ కుటుంబాన్ని స్వయంగా పరామర్శించి, వారి బాధ్యతను తీసుకుంటానని ప్రకటించారు.

జమ్మూ కశ్మీర్ పహల్గాంలో ఇటీవల జరిగిన ఉగ్రదాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో నెల్లూరుకు చెందిన మధుసూదన్ కూడా ఒకరు. బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న మధుసూదన్ ఆకస్మిక మరణంతో ఆయన కుటుంబం తీవ్ర సంక్షోభంలోకి వెళ్లింది. ఈ నేపథ్యంలో, పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు కుటుంబాన్ని పరామర్శించగా, తాజాగా మంచు విష్ణు స్వయంగా కావలిలో ఉన్న వారి ఇంటికి వెళ్లారు.

మధుసూదన్ చిత్రపటానికి నివాళులర్పించిన మంచు విష్ణు, ఆయన భార్య కామాక్షి, పిల్లలతో మాట్లాడి ధైర్యం నింపారు. అనంతరం మధుసూదన్ పిల్లలను తాను దత్తత తీసుకుంటానని, వారి విద్యాభవిష్యత్తును తాను భద్రంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు.

ఇప్పటికే అనాథల కోసం చేస్తున్న సేవలు, ఇప్పుడు ఈ బాధిత కుటుంబానికి అందిస్తున్న మద్దతుతో మంచు విష్ణు పట్ల సినీ అభిమానుల్లో గౌరవం మరింత పెరిగింది. సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇక మంచు విష్ణు నటించిన ‘కన్నప్ప’ సినిమా జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Leave a Reply