నడిరోడ్డుపై యువకులను చితక్కొట్టిన తెనాలి పోలీసులు.. వైరల్‌గా మారిన వీడియో!

తెనాలీలోని పోలీసులు నడిరోడ్డుపైనే ముగ్గురు యువకులను దారుణంగా కొట్టిన ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కానిస్టేబుల్‌పై గంజాయి మత్తులో దాడి చేశారన్న ఆరోపణలతో ఈ దాడి జరిగింది. అయితే బాధితులు మాత్రం ఇది పూర్తిగా అవాస్తవమని, లంచం ఇవ్వకపోయినందుకు తప్పుడు కేసు పెట్టి కొట్టారంటూ ఆరోపిస్తున్నారు.

స్థానికుల అభిప్రాయం ప్రకారం, ఈ దాడులు ప్రధానంగా దళితులు, మైనారిటీలపైనే జరుగుతున్నాయి. బాధితుల్లో చెంచుపేటకు చెందిన దళిత యువకుడు చేబ్రోలు జాన్ విక్టర్ (25), ఐతానగర్‌కు చెందిన దళితుడు దోమా రాకేష్ (25), తిప్పర్ల బజార్‌కు చెందిన ముస్లిం యువకుడు షేక్ బాబులాల్ (21) ఉన్నారు. వీరిని రోడ్లపై బహిరంగంగా కూర్చోబెట్టి, అందరి ముందు చితక్కొట్టడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

బాధితుల వాదన ప్రకారం, 2 టౌన్ పరిధిలోని చిన్న గొడవను తీసుకుని 3 టౌన్ పోలీసు కానిస్టేబుల్ కన్నా చిరంజీవి లంచం అడిగాడని, నిరాకరించడంతో కక్ష పెంచుకుని తప్పుడు కేసులు పెట్టాడని వారు చెబుతున్నారు. అతని పైన ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని బాధితుల కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

వీధి వీధి తిప్పించి, ప్రధాన కూడళ్లలో ప్రజలముందు ఈ హింసాత్మక చర్యలు తీసుకోవడంపై ప్రజాసంఘాలు మండిపడుతున్నాయి. ‘‘నేరం చేసినా న్యాయపద్ధతిలో విచారణ జరిపి, న్యాయస్థానాల్లో పరిష్కరించాలి. ఇలా దాడులు చేయడం అమానుషం’’ అని వారు పేర్కొంటున్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ ఏమయిందని ప్రశ్నిస్తున్నారు.

తెనాలి 2 టౌన్ CI రాముల నాయక్, 3 టౌన్ CI రమేష్ బాబులపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని బాధితుల బంధువులు, హక్కుల సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. కేసును స్వతంత్రంగా విచారించి బాధితులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply