Rythu Bharosa: రైతులకు శుభవార్త.. రేపటినుంచి రైతు భరోసా నిధులు ఖాతాల్లోకి

తెలంగాణ రైతులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. రేపటి నుంచి (జూన్ 17, మంగళవారం) రాష్ట్రంలోని రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ కానున్నట్లు ప్రకటించారు. ఈరోజు నిర్వహించిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో సీఎం ఈ విషయాన్ని వెల్లడించారు.

రైతు భరోసా నిధులు ఎకరాల పరిమితితో సంబంధం లేకుండా అందజేయనున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన ప్రకారం, ఖరీఫ్, రబీ సీజన్లకు ఎకరానికి రూ.6,000 చొప్పున, ఏడాదికి రూ.12,000 చెల్లించనున్నారు.

జూన్ 17 నుంచి 25 వరకు రైతుల ఖాతాల్లోకి నిధులు

ఈ నిధులు జూన్ 17 నుంచి 25 వరకూ విడతల వారీగా రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఇప్పటికే వానాకాలం పంటల సాగు పనుల్లో ఉన్న రైతులకు ఇది ఊరట కలిగించనుంది. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా చర్చ

ఇక స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా ముఖ్యమంత్రి మంత్రులతో సమీక్ష జరిపారు. జిల్లా స్థాయి నేతలతో ఇన్‌ఛార్జ్ మంత్రులు సమన్వయం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు విస్తృతంగా ప్రచారం చేయాలని ఆదేశించారు. ఈ నెలాఖరులో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. వచ్చే నెలలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.

Leave a Reply