తెలంగాణలో మరోసారి ఆర్టీసీ సమ్మె హాట్ టాపిక్గా మారింది. ఉద్యోగుల డిమాండ్లు పరిష్కరించడంలో ప్రభుత్వం అలసత్వం చూపుతోందని ఆరోపిస్తూ, మే 7వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా బస్సు సేవలను నిలిపివేయనున్నట్లు ఆర్టీసీ JAC ప్రకటించింది. దీంతో లక్షలాది మంది ప్రయాణికులకు భారీ అసౌకర్యం తప్పదన్న టెన్షన్ మొదలైంది.
ఆర్టీసీ ఉద్యోగులు వినిపిస్తున్న ప్రధాన డిమాండ్లు – ప్రభుత్వంలో విలీనం, పాత బకాయిల చెల్లింపు, ఉద్యోగ భద్రత, పూర్తి జీతాల చెల్లింపుతో పాటు కొత్త బస్సుల కొనుగోలు అంశాలే. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా, ఇప్పటివరకు హామీలు అమలు కాలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇదే సమయంలో, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. “ప్రజలు ఇబ్బందులు పడేలా సమ్మె చేయకండి, సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చూపుతాం” అని ఉద్యోగులను శాంతపరిచే ప్రయత్నం చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఆర్టీసీ ఆర్థికంగా కుంగిపోయిందని గుర్తుచేస్తూ, ప్రస్తుత ప్రభుత్వం పీఎఫ్, బాండ్లు, సీసీఎస్ బకాయిల చెల్లింపులతో పాటు 3,038 ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకుంటోందని మంత్రి వివరించారు.
అయినా, సమ్మె నోటీసుతో ప్రజలలో ఆందోళన పెరుగుతోంది. రేపటి నుంచి రాష్ట్రంలో బస్సులు నిలిచిపోతే, ఆఫీసులకు, దినసరి ప్రయాణాలకు వెళ్లే వాళ్ళకు చాలా రకరకాల ఇబ్బందులు తప్పవు. ప్రభుత్వం చివరి నిమిషంలో చర్చలకు వస్తేనే సేవలు పునరుద్ధరించే అవకాశం కనిపిస్తుంది.