బెట్టింగ్ యాప్ ప్రమోషన్ వివాదంలో యాంకర్ విష్ణుప్రియకు పోలీసుల నుంచి పెద్ద షాక్ తగిలింది. ఈ రోజు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో విచారణ అనంతరం, ఆమె ఫోన్ను సీజ్ చేశారు. అధికారికంగా స్టేట్మెంట్ రికార్డు చేయడంతో పాటు, కేసు మరింత కీలక దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది.
పోలీసులు ఇప్పటికే 11 మంది సెలబ్రిటీలకు నోటీసులు జారీ చేశారు. తాజాగా విష్ణుప్రియను విచారించడంతో, ఈ కేసు మరింత వేడెక్కింది. తన లాయర్తో కలిసి పోలీస్ స్టేషన్కు హాజరైన ఆమె, మీడియా దృష్టికి చిక్కకుండా స్కార్ఫ్తో ముఖం కప్పుకుని రావడం గమనార్హం.
పోలీసులు బెట్టింగ్ యాప్ నిర్వాహకులతో ఆమెకు ఉన్న సంబంధాలను తీవ్రంగా పరిశీలిస్తున్నారు. ఫోన్ సీజ్ చేయడం వెనుక బలమైన ఆధారాలే కారణమన్న ప్రచారం జోరుగా సాగుతోంది.
ఆమె ప్రమోషన్కి రెమ్యూనరేషన్ ఎలా అందింది? హవాలా మార్గంలో డబ్బు లావాదేవీలు జరిగాయా? ఇంకా ఎవరెవరు ఇందులో ప్రమేయం ఉన్నారు? ఈ ప్రశ్నలకు సమాధానాల కోసం పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. బలమైన ఆధారాలు లభిస్తే, అరెస్ట్ కూడా ఖాయమనే ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి.
ఈ కేసులో మరో పెద్ద ట్విస్ట్ ఏమిటంటే, టాలీవుడ్, బాలీవుడ్ స్టార్స్పై కూడా కేసులు నమోదు కావడం. విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి, ప్రకాశ్ రాజ్, నిధి అగర్వాల్, మంచు లక్ష్మి, శ్రీముఖి, సిరి హనుమంతు, నయని పావని.. వీరితో పాటు బాలీవుడ్ ప్రముఖులు మొత్తం 25 మంది వరకు ఈ కేసులో నిందితులుగా ఉన్నట్లు సమాచారం.
లావాదేవీల్లో అక్రమాలు బయటపడితే, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) కూడా విచారణలోకి దిగే అవకాశం ఉంది. ఒకవేళ ఈడీ రంగంలోకి దిగితే, కేసు మరింత తీవ్రంగా మారే అవకాశముంది. బెట్టింగ్ యాప్ కేసు ఇకపై ఇంకెన్ని సంచలనాలకు దారితీస్తుందో చూడాలి!
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో విచారణకు హాజరైన విష్ణు ప్రియ#vishnupriya #policestation #BettingApps #CaseFiled #LatestNews #BIGTVCinema pic.twitter.com/Mb8O2x23D8
— BIG TV Cinema (@BigtvCinema) March 20, 2025