Betting Apps Case: హైకోర్టు ని ఆశ్రయించిన యాంకర్ శ్యామల – బెట్టింగ్ యాప్ కేసులో కొత్త మలుపు..!

బెట్టింగ్ యాప్ కేసులో ప్రముఖ యాంకర్ శ్యామల తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన ఎఫ్ఐఆర్‌ను రద్దు చేయాలని కోర్టులో పిటిషన్ వేశారు. ఈ కేసుపై ఈరోజు హైకోర్టులో విచారణ జరుగనున్నట్లు సమాచారం. పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసులో ఆమె ప్రమోషన్ చేసిన Andhra365 అనే ఆన్లైన్ గేమింగ్ యాప్ ప్రధాన అంశంగా నిలిచింది.

బెట్టింగ్ యాప్ కేసు మరిన్ని మలుపులు తిరుగుతోంది. ఇప్పటికే 25 మందిపై కేసు నమోదు కాగా, మరికొందరు ప్రముఖ సెలబ్రిటీలు కూడా ఇందులో ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ రియాలిటీ షోలో కంటెస్టెంట్‌గా గుర్తింపు తెచ్చుకున్న శివజ్యోతి కూడా బెట్టింగ్ యాప్‌ను ప్రమోట్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ‘1XBETతో మీ డ్రీమ్ రన్ ప్రారంభించండి’ అంటూ ఆమె చెప్పిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ కేసులో పోలీసులు విచారణను మరింత వేగవంతం చేశారు. యాంకర్ విష్ణుప్రియతో పాటు మరో 11 మంది సెలబ్రిటీలకు ఇప్పటికే పంజాగుట్ట పోలీసులు నోటీసులు జారీ చేశారు. నోటీసులు అందుకున్న అనంతరం నిన్న విష్ణుప్రియ తన లాయర్‌తో కలిసి పోలీసు స్టేషన్‌లో హాజరయ్యారు. విచారణ సమయంలో ఆమె ముఖం కనిపించకుండా తలకు స్కార్ఫ్ కప్పుకున్న తీరు ఆసక్తిగా మారింది.

పోలీసులు విష్ణుప్రియ మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. బెట్టింగ్ యాప్ నిర్వాహకులతో ఆమె ఏం మాట్లాడారు? వాళ్ళ మధ్య ఎలాంటి లావాదేవీలు జరిగాయి? అనే కోణంలో విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో మరికొంతమంది ప్రముఖులు విచారణకు హాజరయ్యే అవకాశం ఉందని సమాచారం.

బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్లకు సంబంధించి సెలబ్రిటీలపై Telangana పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ కేసు మరిన్ని సంచలనాలను వెలుగులోకి తెచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Leave a Reply