తెలంగాణ ప్రభుత్వం మహిళల భద్రతను మరింత పటిష్ఠం చేసే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రాష్ట్రంలోని ప్రైవేట్ క్యాబ్లు, బస్సుల్లో మహిళలు మరింత భద్రంగా ప్రయాణించేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. రాత్రి వేళల్లో ఉద్యోగాలు చేసి తిరిగి ఇంటికి వెళ్లే మహిళలకు ప్రయాణ భద్రత పెంచే లక్ష్యంతో ‘వెహికల్ లొకేషన్ ట్రాకింగ్ డివైజ్’ (VLTD) ను తప్పనిసరి చేసింది.
ఇకపై క్యాబ్ లేదా ప్రైవేట్ బస్సులో మహిళలు ఏదైనా అసౌకర్యానికి గురైతే, అందులో ఏర్పాటు చేయబడిన ప్రత్యేక బటన్ (ప్యానిక్ బటన్) నొక్కితే క్షణాల్లో పోలీసుల సహాయం అందుతుంది. ఈ అలర్ట్ ప్రత్యక్షంగా పోలీస్ కంట్రోల్ రూమ్కు వెళ్తుంది. వెంటనే భద్రతా సిబ్బంది సంబంధిత వాహనం లొకేషన్ ఆధారంగా స్పందించి, అక్కడికి చేరుకుంటారు.
నిర్భయ చట్టం ప్రకారం ఇప్పటికే కొత్తగా రిజిస్టర్ అవుతున్న వాహనాల్లో ఈ ట్రాకింగ్ వ్యవస్థ అమలులో ఉంది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడిది అన్ని పాత వాహనాలకు కూడా విస్తరించింది. మహిళలకు భద్రతను మరింత బలోపేతం చేసేలా ఆర్టీసీ బస్సుల్లో ఇప్పటికే అమలవుతోన్న వెహికల్ ట్రాకింగ్ విధానాన్ని ప్రైవేట్ ప్రజా రవాణా వాహనాల్లోనూ అమలు చేయాలని నిర్ణయించింది.
ఇందులో భాగంగా, మహిళలు ప్రయాణించే క్యాబ్లు, బస్సులు ప్రభుత్వ నియంత్రిత రవాణా కమిషనర్ కార్యాలయం మరియు పోలీస్ కంట్రోల్ రూమ్కు అనుసంధానం కానున్నాయి. డ్రైవర్ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తున్నాడా లేదా? అనేది కూడా అధికారులు పర్యవేక్షించనున్నారు. మహిళలకు వేధింపులు, అత్యవసర పరిస్థితుల నుంచి రక్షణ కల్పించే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ఈ ట్రాకింగ్ వ్యవస్థను తప్పనిసరిగా అమలు చేయనున్నారు.
ఈ కొత్త మార్గదర్శకాలను పాటించని వాహనాలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోనుంది. ట్రాకింగ్ డివైజ్ను అమలు చేయని క్యాబ్లు, బస్సులను సీజ్ చేసి భారీ జరిమానా విధించనుంది. మొత్తం మీద, మహిళలు రాత్రి వేళల్లోనూ భయపడకుండా ప్రయాణించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఈ సంచలన నిర్ణయం తీసుకుంది.